
షార్జా: ఐపీఎల్ 2020 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ.. పటిష్ట ముంబై ఇండియన్స్ను పది వికెట్లతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బెర్త్ను దక్కించుకుంది. అయితే తమ జట్టు విజయాల క్రెడిట్ ఫ్రాంచైజీ యజమానులదేనని, ఫలితాలతో సంబంధం లేకుండా అండగా నిలవడంతోనే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించామని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తాము టైటిల్ గెలిచిన 2016 సీజన్ పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని, మళ్లీ రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక బౌలర్ల సూపర్ పెర్ఫామెన్స్ కారణంగా పటిష్ట ముంబైని ఓడించామన్నాడు.
'కింగ్స్ పంజాబ్ చేతిలో ఎదురైన అనూహ్య ఓటమి తర్వాత ప్లే ఆఫ్స్ చేరడం సంతోషంగా ఉంది. ముంబై కూడా తమ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. కానీ 150 పరుగులకు ఆ జట్టును కట్టడి చేయడం అద్భుతం. నదీమ్ లెఫ్టార్మ్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టి పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్ అసాధారణం. మేం ఎప్పుడూ అద్భుత ప్రదర్శన ఇచ్చాం. ఈ క్రెడిట్ అంతా ఫ్రాంచైజీ ఓనర్స్దే. గోడలా వెనుక ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇక 2016లో కూడా మాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ప్రతీ మ్యాచ్ గెలిచి టైటిల్ అందుకున్నాం. ఇక క్యాచ్ చేజార్చిన రషీద్ ఖాన్ ఎంత బాధపడ్డాడో చూస్తే గెలవాలనే మా కసి అర్థమవుతుంది.
జట్టుకు మంచి ఆరంభాలను అందించడం నా బాధ్యత. అదృష్టం కొద్ది మాకు భారీ లక్ష్యం కూడా లేదు. ఆర్సీబీ బలమైన జట్టు. ఆ టీమ్లో చాలా డేంజరస్ ఆటగాళ్లున్నారు. 2016 ఫైనల్లో వారిని ఓడించాం. వారితో మాకు మరో చావోరేవో మ్యాచ్. ఇదే జోరును కొనసాగిస్తామని అనుకుంటున్నా'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.
ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పొలార్డ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవగా... సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 36; 5 ఫోర్లు), ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. సందీప్ శర్మకు 3 వికెట్లు దక్కగా, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' షాబాజ్ నదీమ్ (2/19) పొదుపుగా బౌలింగ్ చేశాడు.
అనంతరం హైదరాబాద్ 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 151 పరుగులు సాధించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 85 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (45 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చి జట్టును గెలిపించారు. శుక్రవారం జరిగే ఎలిమినేటర్లో బెంగళూరుతో సన్రైజర్స్ తలపడుతుంది.