
దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మోత మోగించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, వృద్ధీమాన్ సాహా ధాటిగా ఆడటంతో ఆరెంజ్ ఆర్మీ పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్. ఇందులో వార్నర్ 54 పరుగులు చేయగా.. వృద్దీమాన్ సాహా 22 రన్స్ చేశాడు. దాంతో ఈ సీజన్లో పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్మెన్గా వార్నర్ గుర్తింపు పొందాడు. ఆ తర్వాత కూడా ఈ జోడీ ధాటిగా ఆడటంతో సన్రైజర్స్ 52 బంతుల్లో 100 పరుగుల మార్క్ను ధాటింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్.
ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్.. ఆరంభం నుంచి ధాటిగా ఆడటం మొదలుపెట్టింది. నోర్జ్ వేసిన ఫస్ట్ ఓవర్లో 5 పరుగులే వచ్చినా.. రబడా బౌలింగ్లో సాహా బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొట్టడంతో 15 రన్స్ వచ్చాయి. అనంతరం ఓవర్కు 10 పరుగులు తగ్గకుండా ఈ జోడీ చెలరేగింది. ఇక రబడా వేసిన ఆరో ఓవర్లో వార్నర్ 4, 4, 0, 6, 4, 4 కొట్టడంతో 22 రన్స్ వచ్చాయి. మరోవైపు వార్నర్ ఆఫ్ సెంచరీ కూడా పూర్తయింది. పవర్ ప్లే ఆనంతరం కొంత వేగం తగ్గినా.. రన్ రేట్ తగ్గకుండా వార్నర్ జాగ్రత్త పడ్డాడు. అయితే అశ్విన్ వేసిన 10వ ఓవర్లో బౌండరీ కొట్టిన వార్నర్ అదే జోరులో మరుసటి బంతిని ఎక్స్ట్రా కవర్స్ దిశగా భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.