మాకు పెద్ద ఓటమే
మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ... 'ఇది మాకు పెద్ద ఓటమే. అయితే మా ప్లేఆఫ్ అవకాశాలు మాత్రం దెబ్బతినలేదు. ఢిల్లీ ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఒక విజయం సాధిస్తే.. ప్లేఆఫ్కు చేరతాం. ఆ ఒక్క విజయం కోసం మూడు మ్యాచ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడటం ఒత్తిడికి గురి చేస్తుంది. కానీ మా ఆటగాళ్లు మానసికంగా బలంగా ఉన్నారు. సన్రైజర్స్ చేతిలో ఓటమి జట్టుకు ప్రేరణనిస్తుంది' అని తెలిపాడు.
దురదృష్టవశాత్తూ టాస్ గెలిచా
'సన్రైజర్స్తో మ్యాచ్లో పవర్ ప్లేలోనే మేము ఓడిపోయాం. తొలి ఆరు ఓవర్లలో 70 పరుగులు చేయడం నిజంగా ప్రశంసనీయం. సన్రైజర్స్ బ్యాట్స్మెన్ మా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. అయితే ఈ ఓటమి మాపై ప్రతికూల ప్రభావం చూపబోదు. కొన్ని మ్యాచ్లు ఓడినా.. ఈ సీజన్లో మేము అద్భుతంగా ఆడాం. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. దుబాయ్ వికెట్ ఎప్పటికప్పుడు మారుతోంది. పిచ్ను అంచనా వేయడం కష్టంగా మారింది. టాస్ గెలిచినప్పుడు బ్యాటింగ్ ఎంచుకోవాలా లేదా ఫీల్డింగ్ ఎంచుకోవాలనే ఆలోచనలో ఉంటున్నా. అందుకే టాస్ ఓడటం మంచిది. కానీ దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్లో నేను టాస్ గెలిచా' అని శ్రేయాస్ అయ్యర్ నవ్వుకున్నాడు.
ఎవర్నీ తక్కువ అంచనా వేయలేం
ఈ మ్యాచ్లో మంచు కీలక పాత్ర పోషిస్తుందని తాను భావించానని, కానీ బంతి నెమ్మదిగా వచ్చిందని ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు.ప్రత్యర్థి బ్యాట్స్మెన్ గురించి చాలా చర్చించామన్నాడు. మైదానంలో తమ ప్లాన్లను అమలు చేయడానికి ప్రయత్నించామని, కానీ అవేవీ వర్కౌట్ కాలేదన్నాడు. సన్రైజర్స్ ఆరంభం బాగుందని, 219 రన్స్ చేయడం మంచి ప్రదర్శన అని శ్రేయాస్ కొనియాడాడు. టోర్నీలో ఏ జట్టయినా ఆశ్చర్యపరచొచ్చని, అన్ని జట్లు సమామేనని, ఎవర్నీ తక్కువ అంచనా వేయలేమని అయ్యర్ తెలిపాడు. బెంగళూరు, ముంబై జట్లతో తలపడాల్సి ఉందని.. ఇప్పటికే కోహ్లీసేనపై గెలిచాం కాబట్టి ముంబై గెలవాలన్నాడు.
ఒక్కటి గెలిచినా నేరుగా ప్లేఆఫ్కు
ఐపీఎల్ 2020లో ఇప్పటిదాకా 12 మ్యాచ్లను ఆడిన ఢిల్లీ ఏడింట్లో విజయం సాధించింది. 14 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్లేఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకోవాలంటే 16 పాయింట్లు అవసరం. ప్లేఆఫ్ చేరే దశలో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక ఢిల్లీ రెండు మ్యాచులు ఆడాలి. ఈ రెండు మ్యాచ్లూ ఢిల్లీకి అగ్నిపరీక్ష పెట్టేవే. తనతో సమవుజ్జీలుగా ఉన్న ముంబై, బెంగళూరు జట్లను ఢీకొట్టాల్సి ఉంది. ఈ నెల 31వ తేదీన ముంబై, వచ్చేనెల 2న బెంగళూరుతో మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో ఏ ఒక్కటి గెలిచినా ఢిల్లీ నేరుగా ప్లేఆఫ్కు చేరుకుంటుంది.