ముంబై: భారత క్రికెట్ జట్టుకు తాజాగా కరోనా సెగ తగిలింది. టీమిండియా సహాయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020లో కరోనా కేసులు నమోదయిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా, సిబ్బందికి సంబంధించి మాత్రం ఇదే తొలి కరోనా కేసు. దీంతో కరోనా బాధితుడు రవిశాస్త్రి బృందంతో పాటు దుబాయ్కి వెళ్లలేదు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఆదివారం టీమిండియా సిబ్బంది యూఏఈ బయలుదేరాల్సి ఉన్నప్పటికీ.. కరోనా సోకడంతో అతడు 14 రోజుల క్వారంటైన్కు వెళ్ళిపోయాడు.
రెండు వారాల ఐసోలేషన్ ముగిశాక కరోనా నెగెటివ్ రిపోర్టు వస్తేనే సదరు టీమిండియా సిబ్బంది దుబాయ్ వెళుతాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే.. దుబాయ్ నుంచే ఆస్ట్రేలియాకు పయనమవుతుంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, మేనేజర్ గిరీశ్ డోంగ్రేలతో పాటు టెస్టు స్పెషలిస్టులు హనుమ విహారి, చతేశ్వర్ పుజారా ఆదివారం దుబాయ్ చేరుకున్నారు. వీరికి కోవిడ్ పరీక్షలు, ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో బయో బబుల్లోకి తీసుకున్నారు.
చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలకు దుబాయ్లో ఉన్న ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పిస్తారు. ఇక ఐపీఎల్ 2020లోని కొన్ని జట్లు ఆటగాళ్ల కుటుంబ సబ్యులకు అనుమతి ఇచ్చారు. మరికొన్ని జట్లు అనుమతి ఇవ్వలేదు. దీంతో కొందరు ఆటగాళ్లు సుదీర్ఘ పర్యటన కోసం తమ భార్యలను వెంటతీసుకు వెళ్లేందుకు బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు నెలలుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో వారిని దుబాయ్కి రావాల్సిందిగా పలువురు ఆటగాళ్లు ఇప్పటికే సమాచారం ఇచ్చారు.
ఈ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరుగనున్నాయి. సిడ్నీలో తొలి వన్డే నవంబరు 27న జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 8:30 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ డిసెంబరు 4న, తొలి టెస్టు మ్యాచ్ డిసెంబరు 17న మొదలవనున్నాయి. ఐపీఎల్ 2020 నవంబరు 10తో ముగియనుండగా.. యూఏఈ నుంచి ఛార్టర్డ్ ప్లైట్లో ఆస్ట్రేలియాకి భారత ఆటగాళ్లు వెళ్లనున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత 14 రోజులు క్వారంటైన్లో ఉండి మ్యాచులు ఆడతారు.
India vs Australia షెడ్యూల్ విడుదల.. నవంబరు 27న మొదటి వన్డే!!