
దుబాయ్: సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షేన్ వాట్సన్(38 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 42), అంబటి రాయుడు (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 41) రాణించడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 రన్స్ చేసింది. చివర్లో ధోనీ(13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 21), రవీంద్ర జడేజా(10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 25 నాటౌట్) ధాటిగా ఆడటంతో చెన్నై గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు మంచి శుభారంభం దక్కలేదు. ఆల్రౌండర్ సామ్ కరన్(21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31) ఓపెనింగ్ పంపించి సీఎస్కే ప్రయోగం చేసినా.. ఫలితం దక్కలేదు. ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. సందీప్ శర్మ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా ఔటయ్యాడు. ఇక ఫాఫ్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన షేన్ వాట్సన్తో సామ్ కరన్ ధాటిగా ఆడాడు. అయితే అదే జోరును కొనసాగించలేకపోయాడు. సందీప్ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై రెండు వికెట్లకు 44 రన్స్ చేసింది.
ఈ క్రమంలో షేన్ వాట్సన్, అంబటి రాయుడు బాధ్యతాయుతంగా ఆడారు. మంచి బంతులను గౌరవిస్తూ చెడ్డ బంతులను బౌండరీకి తరలించారు. ఇక క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని నటరాజన్ విడదీసాడు. అతని బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన వాట్సన్.. మనీష్ పాండే చేతికి చిక్కాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఖలీల్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే అదే తరహా షాట్ ఆడిన రాయుడు.. వార్నర్ సూపర్ క్యాచ్కు నిరాశగా వెనుదిరిగాడు. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోవడంతో చెన్నై స్కోర్ వేగం తగ్గింది.
ఈ స్థితిలో ధోనీ, జడేజా ఓవర్కు ఓ ఫోర్ కొడుతూ భారీ స్కోర్ చేసే ప్రయత్నం చేశారు. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో జడేజా ఫోర్ కొట్టగా.. యార్కర్ను ధోనీ తన ట్రేడ్ మార్క్ హెలికాప్టర్ షాట్తో భారీ సిక్సర్ కొట్టాడు. ఆ వెంటనే ఆ తరహా షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లో ఫస్ట్ బాల్కే డ్వేన్ బ్రావో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అనంతరం జడేజా ఓ సిక్స్ ,ఫోర్ కొట్టడంతో ఆఖరి ఓవర్లో 15 రన్స్ వచ్చాయి.