
షార్జా: ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. ఆల్రౌండ్ షోతో అదరగొడుతూ ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 46 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది.
టాపార్డర్ విఫలమైన వేళ మిడిలార్డర్లో మార్కస్ స్టోయినిస్(30 బంతుల్లో 4 సిక్స్లతో 39), షిమ్రాన్ హెట్మైర్(24 బంతుల్లో 5 సిక్స్లు 1 ఫోర్తో 45) మెరుపులు మెరిపించడం.. ఆ తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్ రాయల్స్పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరోవైపు బౌలింగ్లో పర్వాలేదనిపించిన రాజస్థాన్..బ్యాటింగ్లో చేతులెత్తే యడంతో నాలుగో ఓటమి ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో హ్యాట్రిక్ విజయాన్నందుకు ఢిల్లీ టేబుల్ టాపర్గా నిలిచింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రాహుల్ తెవాటియా, ఆండ్రూ టై చెరొక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం రాజస్థాన్ 19.4 ఓవర్లలో 138 రన్స్కు ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్లలో రబడా మూడు వికెట్లు తీయగా.. అశ్విన్, స్టోయినిస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. నోర్జ్, అక్షర్ పటేల్, హార్దిక్ పటేల్కు తలో వికెట్ దక్కింది.
రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్(13), స్టీవ్ స్మిత్(24), సంజూ శాంసన్(5), మహిపాల్ లోమ్రోర్(1) దారుణంగా విఫలమయ్యారు. అండర్-19 కుర్రాడు యశస్వీ జైస్వాల్(36 బంతుల్లో 1ఫోర్, 2 సిక్స్లతో 34) క్రీజులో నిలదొక్కుకున్నా.. ధాటిగా ఆడలేకపోయాడు. చివర్లో రాహుల్ తెవాటియా(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) పోరాడినా ఫలితం లేకపోయింది.
ఇక రాజస్థాన్ రాయల్స్ గెలిచిన రెండు మ్యాచ్లు షార్జాలోనే గెలవడంతో ఆ జట్టు రాత మారుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆ జట్టు అదే వైఫల్యాన్ని కొనసాగిస్తూ మూల్యం చెల్లించుకుంది. జట్టులో మార్పులు చేసినా.. అచ్చొచ్చిన మైదానంలో బరిలోకి దిగినా రాయల్స్ రాత మారలేదు.. ఢిల్లీ జోరు ఆగలేదు.!