
దుబాయ్: అందరూ ఊహించినట్లుగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ వ్యూయర్షిప్లో వరల్డ్ రికార్డు సృష్టించింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్కు అదిరిపోయే వ్యూస్ వచ్చాయి. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్) లెక్కల ప్రకారం 20 కోట్ల మంది ఈ మ్యాచ్ను చూశారు.
ప్రపంచంలోనే మరే ఇతర క్రీడా ఈవెంట్ ప్రారంభ రోజు ఇన్ని వ్యూస్ రాలేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జై షా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ వ్యూస్ అన్నీ స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్స్టార్ ప్లస్ ద్వారా వచ్చాయని తెలిపాడు.
'డ్రీమ్ 11 ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. బార్క్ లెక్క ప్రకారం తొలి మ్యాచ్ను ఎవరూ ఊహించని విధంగా 20 కోట్ల మంది చూశారు. క్రీడా చరిత్రలో ఒపెనింగ్ డేకు ఇన్ని వ్యూస్ రావడం తొలిసారి.'అని జైషా ట్వీట్ చేశారు. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీతో యూఏఈలోనే ఉన్న జైషా ఐపీఎల్ టోర్నీని పర్యవేక్షిస్తున్నారు.
ఇక కరోనా కారణంగా క్రీడాటోర్నీలు అన్ని రద్దవ్వడం.. క్యాష్ రిచ్ లీగ్ దుబాయ్కి తరలడం.. ఖాళీ స్టేడియాల్లో జరుగుతుండటంతో ఐపీఎల్కు వ్యూస్ తాకిడి పెరిగింది. గత ఆరు నెలలుగా క్రికెట్ టోర్నీలు జరగకపోవడంతో వ్యూయర్షిప్ పరంగా ఐపీఎల్ 2020 రికార్డులు బ్రేక్ చేస్తుందని గంగూలీ టోర్నీకి ముందే చెప్పాడు.
ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో గెలుపొందడం కూడా కలిసొచ్చింది. అలాగే 14 నెలల తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి అడుగుపెట్టడం.. అది కూడా అంతర్జాతీయ క్రికెట్ గుడ్బై చెప్పిన తర్వాత కావడంతో ఈ ఆరంభం మ్యాచ్కు అదిరిపోయే వ్యూస్ వచ్చాయి.