
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో దూసుకెళుతోంది. సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 59 పరగులతో చిత్తు చేసింది. ఈ ఘన విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే స్వేచ్చగా ఆడటమే తమ విజయ రహస్యమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. సమష్టి ప్రదర్శనతో చెలరేగుతున్న తమ జట్టు ఆటగాళ్లను ప్రశంసించాడు.
'ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. కుర్రాళ్ల ప్రదర్శనకు హ్యాట్సాఫ్. ఒత్తిడిని చిత్తు చేస్తూ ఎంతో పరిణితి కనబరుస్తున్నారు. ఏమాత్రం బయపడకుండా స్వేచ్ఛగా ఆడటమే మా విజయం రహస్యం. మా జట్టులో మంచి యువ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు ఎంతో కష్టపడుతున్నారు. మా ఆటతీరుపై కెప్టెన్గా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇదే ఊపును మరింత కొనసాగించాల్సిన అవసరం ఉంది. సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గాయంతో జట్టుకు దూరమవడం కొంత బాధ కలిగించింది. అయితే.. అందుకు తగ్గ ప్రత్యామ్నాయం కూడా మా దగ్గర ఉండటం మా జట్టుకు కలిసొచ్చే ఆంశం' అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్) చెలరేగగా... పృథ్వీషా (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు 42) రాణించాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసి ఓడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (39 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 43) తప్ప ఎవరూ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కగిసో రబడ (4/24) బెంగళూరు పతనాన్ని శాసించాడు. మరో పేసర్ నోర్జ్కు రెండు వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.