
షార్జా: ఎలాంటి పరిస్థితిల్లోనైనా బౌలింగ్ చేయగలగడమే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యేకతని ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 46 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం అవార్డు అందుకున్న సమయంలో మాట్లాడాడు. ఈ విజయాల క్రెడిట్ తమ సపోర్ట్ స్టాఫ్కే దక్కుతుందన్నాడు.
'జోస్ బట్లర్ వికెట్ను ఎంతో ఆస్వాదించా. ఒక మంచి క్యాచ్ కూడా అందుకున్నా. పవర్ప్లేలో క్యారమ్బాల్ ఒకటీ.. రెండు సార్లు వేశాను. అయితే, బంతిపై తేమ ఉండి స్పిన్కు అంతగా అనుకూలించలేదు. నేను శారీరకంగా, మానసికంగా ఎంతో ఫిట్గా ఉన్నాను. నా శరీరాన్ని ఇబ్బంది పెడుూ మైదానంలోకి దిగను. అన్ని రకాలుగా దృఢంగా ఉంటేనే మ్యాచ్కు సిద్ధంగా ఉన్నానని భావిస్తా. అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెడతా' అని ఈ సీనియర్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.
గత సీజన్లో జోస్ బట్లర్ను అశ్విన్ మన్కడింగ్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది. క్రీడా స్పూర్తికి విరుద్దం అంటూ అశ్విన్ తీరును చాలా మంది తప్పుబట్టారు. అతను కూడా గట్టిగానే కౌంటరిచ్చాడు. నిబంధనల్లో ఉన్నదే తాను చేసానన్నాడు. ఇప్పటికీ ఆ చర్చ నడుస్తూనే ఉంది. అయితే తాజా మ్యాచ్లో అశ్విన్ బౌలింగ్లోనే బట్లర్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దీంతో నాటి మ్యాచ్ను అభిమానులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హోస్ట్ అశ్విన్ దీనిగురించి ప్రశ్నించగా.. బట్లర్ వికెట్ను అస్వాదించానన్నాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్మైర్ (24 బంతుల్లో 45; 1 ఫోర్, 5 సిక్సర్లు), స్టొయినిస్ (30 బంతుల్లో 39; 4 సిక్సర్లు) మెరిపించారు. ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 138 పరుగులే చేసి ఆలౌటైంది. రాహుల్ తేవటియా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్లు) మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్ రబడ 3 వికెట్లు తీశాడు.