
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్కు కరోనా సోకింది. బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం ఏ ఫ్రాంచైజీ అయినా తమ జట్టును యూఏఈకి తరలించే ముందు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం దుబాయ్కి వెళ్లేందుకు ముంబైలో సమావేశం కావాలనుకున్న రాజస్థాన్ టీమ్.. అందరిని కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆదేశించింది.
ఫ్రాంచైజీ సూచనలతో దిషాంత్ యగ్నిక్ కోవిడ్-19 పరీక్షలు చేసుకోగా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఆటగాళ్లందరకి అదనపు టెస్ట్లు చేసేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్దమైంది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ అయిన దిశాంత్.. రాజస్థాన్ తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫునే బరిలోకి దిగాడు. ప్రస్తుతం తన స్వస్థలం ఉదయ్పూర్లో ఉన్న అతను ఆసుపత్రిలో చేరాడు. అక్కడే 14 రోజుల క్వారంటైన్ పాటించనున్నాడు.
'ఈ 14 రోజుల క్వారంటైన్ అనంతరం బీసీసీఐ ప్రోటోకాల్స్ ప్రకారం దిశాంత్కు రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. ఆ టెస్ట్ల్లో నెగటీవ్ వస్తే.. యూఏఈకి తీసుకొచ్చి మరో 6 రోజుల క్వారంటైన్లో ఉంచుతాం. ఆ సమయంలో మూడు పరీక్షలు నిర్వహించి నెగటీవ్ వస్తే జట్టుతో కలవడానికి అనుమతిస్తాం.'అని రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
అలాగే దిశాంత్తో టచ్లో ఉన్న ఆటగాళ్లంతా క్వారంటైన్ పాటిస్తూ కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాలని కోరింది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లతో పాటు ఇతర ఐపీఎల్ ప్లేయర్లు ఎవరూ దిశాంత్ను కలవలేదని స్పష్టం చేసింది.