హైదరాబాద్: ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ ప్లే ఆఫ్స్ సమరం ఆసక్తికరంగా మారింది. టైటిల్ రేసులో నిలిచే జట్లు ఏవో ఆఖరి మ్యాచ్ వరకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముంబై ఇండియన్స్తో మంగళవారం జరిగే మ్యాచ్ ఫలితంతో సన్రైజర్స్ హైదరాబాద్తో పాటు ఇతర జట్ల భవితవ్యం తేలనుంది.
ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్ మాత్రమే 18 పాయింట్లతో ప్లేఆఫ్కి అర్హత సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన రెండు మ్యాచ్ల ఫలితాలతో పంజాబ్, చెన్నై, రాజస్థాన్ మూడు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మిగిలిన నాలుగు జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మూడు ప్లేఆఫ్ బెర్తుల కోసం పోటీపడుతున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నేడు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కి అర్హత సాధిస్తుంది. ఓడిపోయిన జట్టు కూడా రేసులో ఉన్నప్పటికీ.. మంగళవారం జరిగే హైదరాబాద్, ముంబై మ్యాచ్ ఫలితంపై ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిస్తే.. ఆ జట్టు మూడో స్థానంలో ప్లేఆఫ్కు క్వాలిఫై అవుతుంది. అప్పుడు కోల్కతా, ఢిల్లీ- బెంగళూరు మ్యాచ్లో ఓడిన జట్టు నాలుగో బెర్తు కోసం పోటీపడనున్నాయి. ఈ రెండింటిలో మెరుగైన రన్రేట్ ఏ జట్టుకి ఉంటే అది ప్లేఆఫ్కి చేరుతుంది. ఒకవేళ సన్రైజర్స్ హైదరాబాద్ మంగళవారం ముంబై చేతిలో ఓడితే మాత్రం కోల్కతా, ఢిల్లీ- బెంగళూరు మ్యాచ్లో ఓడిన జట్టు కూడా సులువుగా ప్లేఆఫ్కు చేరుకుంటాయి.
కానీ హైదరాబాద్ గెలిచి.. ఢిల్లీ-బెంగళూరు మ్యాచ్లో ఓడిన జట్టు రన్రేట్ కోల్కతా టీమ్ రన్రేట్తో సమం అయితే పరిస్థితి ఏందనే సందేహం కలుగుతుంది. అయితే ఆ పరిస్థితే ఎదురైతే ఐపీఎల్ నిబంధనల ప్రకారం వికెట్లు ఎక్కువగా తీసిన జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. వికెట్లు కూడా సమమైతే డ్రా తీస్తారు. ఇదే జరిగితే మాత్రం కోల్కతా ఇంటి ముఖం పట్టడం ఖాయం. ఎందుకంటే ఆర్సీబీ, ఢిల్లీ కంటే ఆ జట్టు తక్కవ వికెట్లు తీసింది. ఆర్సీబీ ఇప్పటి వరకు 73 వికెట్లు తీయగా.. ఢిల్లీ 70 వికెట్లు పడగొట్టింది. కోల్కతా మాత్రం 68 వికెట్లకే పరిమితమైంది.
ఐపీఎల్ నిబంధన 16.10.2.3 ప్రకారం జట్ల రన్ రేట్ సమమైనప్పుడు టోర్నీలో ఎక్కవ వికెట్లు తీసిన టీమ్ ముందుకు అర్హత సాధిస్తుంది. వికెట్లు కూడా సమం అయితే 16.10.2.4 రూల్ ప్రకారం డ్రా తీస్తారు. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి అయితే ఎదురుకాలేదు.
వీడెవడో ఆ తమిళ జ్యోతిష్యుడిని మించిపోయాడు! చెప్పినట్లే జరిగింది..హైదరాబాద్ టైటిల్ గెలవడమే మిగిలింది!