
హైదరాబాద్: వాట్ ఎ మ్యాచ్.. రెండు జట్ల స్కోర్లు సమం కావడమే అరుదైతే.. ఏకంగా సూపర్ ఓవర్ కూడా మరో సూపర్ ఓవర్కు దారి తీస్తే ఆ పోరాటాన్ని ఏమని వర్ణించగలం.. ముంబై-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి అరుదైన సన్నివేశమే ఆవిష్కృతమైంది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన పోరు మునివేళ్ల మీద నిలబెట్టింది. అయితే ఈ పరిస్థితుల్లో గోళ్లు కొరుకుతూ ఓ బ్యూటీ టీవీ కెమెరాల్లో తళుక్కుమంది.
అంతే ఆమె కోసం నెటిజన్లు వెతకడం మొదలు పెట్టారు. సినీ హీరోయిన్లా ఉన్న ఆమె అందానికి దాసోహం అయ్యారు. ఉత్కంఠకే ఊపిరి సడలని మ్యాచ్లో గోళ్లు కొరుకుతూ అమయాకంగా పెట్టి ఆమె ఎక్స్ప్రెషన్కు ఫిదా అయ్యారు. 25 సెకండ్ల పాటు కనిపించిన ఈ బ్యూటీ యావత్ దేశ దృష్టిని ఆకర్షించింది.
వెంటనే ఆమె వివరాలు తెలుసుకోవడానికి అభిమానులు ట్విటర్ను ఆశ్రయించారు. ఎట్టకేలకు ఆమె ఇన్స్టా ఐడీ సాధించారు. కానీ పూర్తి వివరాలు మాత్రం తెలుసుకోలేకపోయారు. ఆ మిస్టరీ గర్ల్ పేరు రియానా లల్వానీ. ఈ ఒక్క సీన్తో ఆమె ఫాలోవర్లు అమాంతం పెరిగిపోయారు. ప్రస్తుతం నెట్టింట ఆమె పేరు మారుమోగుతుంది. ఈ దెబ్బకు రైనా లల్వానీ త్వరలోనే బాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.అయితే కరోనా నేపథ్యంలో మ్యాచ్లు చూసేందుకు అభిమానులకు అనుమతి లేదు. కాబట్టి ఆమె ఫ్రాంచైజీలకు సంబంధించిన వ్యక్తే అయి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 రన్స్ చేసింది. క్వింటన్ డికాక్(43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 53)హాఫ్ సెంచరీకి తోడు చివర్లో కీరన్ పొలార్డ్(12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 34 నాటౌట్), కౌల్టర్ నీల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. అనంతరం కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులే చేసింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత తొలి సూపర్ ఓవర్లో పంజాబ్ 5 పరుగులే చేయగా.. ముంబై కూడా అన్నే రన్స్ చేయడంతో మ్యాచ్ మరోసారి టై అయింది. ఇక సెకండ్ సూపర్ ఓవర్లో జోర్డాన్ 11 పరుగులివ్వగా.. గేల్, మయాంక్ నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు.