దుబాయ్: ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పేలవమైన ఆటతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అయినా ఆ జట్టుపై ఉన్న ప్రేమ అభిమానులకు ఏ మాత్రం తగ్గలేదు. ఆ మధ్య తమిళనాడులోని గోపి కృష్ణన్ అనే ఓ అభిమాని సీఎస్కే కెప్టెన్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్న విషయం తెలిసిందే. తన ఇంటిని మొత్తం సీఎస్కే జట్టు రంగైన పసుపు రంగులోకి మార్చేసిన అతను.. దానికి 'హోమ్ ఆఫ్ ధోని' అని పేరు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఆ మధ్య నెట్టింట హల్చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా తన అధికారిక ట్విటర్లో అభిమానులతో పంచుకుంది.
అయితే తాజాగా ఆ డై హార్డ్ ఫ్యాన్ చేసిన ఈ పనిపై ధోనీ స్పందించాడు. ఇది మాములు విషయం కాదని, అతనికి చెన్నై జట్టుపై ఉన్న ఇష్టం ఏంటో తెలుస్తుందన్నాడు. ఈ వీడియోను చెన్నై ట్వీట్ చేసింది. 'ఆ ఫోటోలను నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. అది నిజంగా చాలా గొప్పగా అనిపించింది. కేవలం అతను నా అభిమాని మాత్రమే కాదు.. సీఎస్కేను బాగా ఇష్టపడే వ్యక్తని అర్థమైంది. అలా చేయడం అంత సులువుకాదు. ఒక ఇంటి కలర్నే మార్చాలంటే మొత్తం కుటుంబమే ఒప్పుకోవాలి. ముందు కూర్చొని అంతా ఒప్పుకున్న తర్వాతే అలా చేయగలుగుతాం. అతను సీఎస్కేకు అతి పెద్ద అభిమాని అనే విషయం తెలుస్తోంది. అది కేవలం ట్వీటర్ పోస్టో.. ఇన్స్టాగ్రామ్ పోస్టో కాదు. అది ఎప్పటికీ నిలిచిపోయేది'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించినా... మరో మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్తాన్ రాయల్స్ జట్టు గెలుపొందడంతో... చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు మూసుకుపోయాయి. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో చెన్నై జట్టు లీగ్ దశలోనే వెనుదిరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ 12 మ్యాచ్లు ఆడిన సీఎస్కే కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. బ్యాటింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది.
నీ భార్యను 14 రోజులు ఇవ్వూ... బెన్ స్టోక్స్పై వెస్టిండీస్ క్రికెటర్ అసభ్య పదజాలం!