|
కాస్త ఓపికగా ఉండు:
బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ (79) కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎంపిక చేయకపోవడంతోనే ఇలా కసిగా ఆడాడని పలువురు క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి గతరాత్రి సూర్యకుమార్ను ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికర పోస్టు చేశాడు. అతడిని పొగుడుతూ సహనంతో ఉండాలని చెప్పాడు. సూర్య నమస్కారం అంటూ చేతులు జోడించిన ఓ ఎమోజీని పోస్టు చేశారు. 'సూర్య నమస్కార్. ధైర్యంగా, కాస్త ఓపికగా ఉండు' అంటూ కామెంట్ చేశారు.
|
మీరు కోచ్గా ఉండాల్సింది:
రవిశాస్త్రి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ సందేశం సూర్యకుమార్ను సంతోష పెడుతుందని టీమిండియా వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారి ఆశాభావం వ్యక్తం చేశాడు. 'నేను సెంచరీ చేసిన సిరీస్లో మీరు భారత జట్టు కోచ్గా ఉండాల్సి ఉంది. మీ నుంచి ఇలాంటి సందేశం వస్తే.. కచ్చితంగా నా అంతర్జాతీయ కెరీర్కు ఎంతో దోహదపడేది. మీ నుంచి ఈ ట్వీట్ రావడం చూసి సూర్యకుమార్ యాదవ్ సంతోషిస్తాడు' అని తివారి రీట్వీట్ చేశాడు.
2011లో సెంచరీ:
భారత్ తరఫున 2008 నుంచి 2015 వరకు అరకొరగా అవకాశాలు దక్కించుకున్న మనోజ్ తివారి మొత్తం 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2011 విండీస్-భారత పర్యటన సందర్భంగా ఐదో వన్డేలో శతకంతో మెరిశాడు. ఈ సిరీస్ను ఉద్దేశించే తివారి ట్వీట్ చేశాడు. ఆ సెంచరీ తర్వాత కూడా తివారికి జట్టులో స్థానం దక్కలేదు. ఆపై కూడా ఈ వెటరన్ క్రికెటర్ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోవడంతో దేశవాళీ క్రికెట్కే పరిమితమయ్యాడు. మరోవైపు ఐపీఎల్ టోర్నీలో కూడా అవకాశాలు రావట్లేదు.
ముంబై ట్వీట్:
బెంగళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ముంబై ఛేదనలో కొరకరాని కొయ్యలా మారిన సూర్యకుమార్ దగ్గరకు వెళ్లిన విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేస్తూ ఏవో వ్యాఖ్యలు చేశాడు. దానికి సూర్యకుమార్ స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అయితే సూర్యకుమార్ దగ్గరకు కోహ్లీ వచ్చిన ఫొటోను ముంబై యాజమాన్యం ట్విటర్లో పోస్టు చేసింది. 'అతను వచ్చాడు.. ప్రారంభించాడు.. సాధించాడు' అని ఆ పోస్టులో పేర్కొంది. ఆ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైస్ కెప్టెన్ అవుతానని అస్సలు ఊహించలేదు.. ఆనందం పట్టలేకున్నా: రాహుల్