
అబుదాబి: ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై 8 వికెట్లతో కోల్కతా నైట్రైడర్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్తో కేకేఆర్ టాపార్డర్ చేతులెత్తేయగా.. ప్యాట్ కమిన్స్(36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్), ఇయాన్ మోర్గాన్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 39 నాటౌట్) అద్భుత భాగస్వామ్యంతో ఆదుకున్నారు.
ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, నాథన్ కౌల్టర్ నీల్, బుమ్రా తలో వికెట్ తీయగా.. రాహుల్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం క్వింటన్ డికాక్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 78 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలగడంతో ముంబై ఇండియన్స్ 16.5 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 149 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. డికాక్కు తోడుగా రోహిత్ శర్మ(36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 35), హార్దిక్ పాండ్యా(11 బంతుల్లో 21 నాటౌట్) రాణించారు.
ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో టాప్లోకి దూసుకెళ్లగా కొత్త కెప్టెన్తో బరిలోకి దిగిన కోల్కతా మాత్రం తమ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్లో కేకేఆర్తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ముంబైనే విజయం సాధించింది. మరొకవైపు ఇరుజట్లు తలపడిన చివరి 12 మ్యాచ్ల్లో 11 సార్లు ముంబై గెలవడం గమనార్హం.
ఇక 149 పరుగు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ మంచి శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ వీలుచిక్కిన బంతులను బౌండరీలకు తరలించడంతో ముంబై ఇండియన్స్ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. అనంతరం కూడా ఈ జోడీ ధాటిగా ఆడింది. ఈ క్రమంలోనే డికాక్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
గత నాలుగు మ్యాచ్ల్లో డికాక్కు ఇది మూడో హాఫ్ సెంచరీ. ఆ వెంటనే శివం మావీ బౌలింగ్లో రోహిత్ శర్మ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(10) ఆకట్టుకోలేకపోయాడు. వరుణ్ చక్రవర్తిల బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా-డీకాక్లు ముంబై విజయ లాంచనాన్ని పూర్తి చేశారు.