
దుబాయ్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లో లేకపోవడం క్వాలిఫయర్లో తమకు కలిసొచ్చే విషయమని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. ఐపీఎల్ 2020 సీజన్ ప్లే ఆఫ్స్లో భాగంగా నేడు జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటుంది. ఈ సూపర్ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శిఖర్.. తమ విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. ముంబైపై చెలరేగేందుకు అన్ని విధాల సిద్దమయ్యానన్నాడు.
'ముంబైకి పై చేయి ఉన్నట్లు ఏమీ లేదు. మేం చాలా బలంగా ఉన్నాం. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణిస్తే మాదే విజయం. మా ప్రణాళికలపై స్పష్టంగా ఉన్నాం. ముంబైతో మ్యాచ్కు నేను అన్ని విధాల సిద్దమయ్యాను. వారి బౌలర్లను నేను చాలా సార్లు ఎదుర్కొన్నాను. మా జట్టుకు విజయాన్నందించడానికి సిద్దంగా ఉన్నాను.రోహిత్ శర్మ వెరీ గుడ్ ప్లేయర్. కానీ.. ఐపీఎల్ 2020 సీజన్లో అతను ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కాబట్టి అతను బ్యాటింగ్ టచ్లో ఉన్నాడని నేను అనుకోవట్లేదు. క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కి రోహిత్ శర్మ టచ్లో లేకపోవడం కలిసిరానుంది'అని శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2020 సీజన్లో 10 మ్యాచ్లాడిన రోహిత్ శర్మ 126.92 స్ట్రైక్రేట్తో 264 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 14 మ్యాచ్లాడిన శిఖర్ ధావన్ 145.02 స్ట్రైక్రేట్తో 525 పరుగులు చేయగా.. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం.
ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కి వెళ్లనుంది. ఓడిన జట్టు ఆదివారం క్వాలిఫయర్-2 ఆడనుంది. లీగ్ దశలో ముంబై టీమ్ 9 మ్యాచ్ల్లో గెలుపొంది 18 పాయింట్లతో పట్టికలో నెం.1 స్థానంలో నిలవగా.. ఢిల్లీ ఆడిన 14 మ్యాచ్లకిగానూ 8 మ్యాచ్ల్లో విజయాల్ని అందుకుని 16 పాయింట్లతో రెండో ప్లేఆఫ్ బెర్తుని దక్కించుకుంది. అయితే.. ముంబై టీమ్ చివరిగా ఆడిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోగా.. ఢిల్లీ మాత్రం బెంగళూరుపై స్ఫూర్తిదాయక విజయంతో లీగ్ దశని ముగించింది. కానీ లీగ్ దశలో ముంబైతో జరిగిన రెండు మ్యాచ్ల్లో ఢిల్లీ ఓడింది.