
అబుదాబి: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. లీగ్లో 7 మ్యాచ్లాడిన రోహిత్ సేన ఐదో విజయంతో 'టాప్'లోకి వచ్చింది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచింది. అయితే ఈ మ్యాచ్లో బర్త్డే బాయ్ హార్దిక్ పాండ్యాపై అతని అన్న కృనాల్ పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ త్రో విషయంలో హార్దిక్పై కృనాల్ గుస్సా అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఢిల్లీ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో కృనాల్ పాండ్యా వేసిన ఐదో బంతిని శ్రేయస్ అయ్యర్ సిల్లీ కవర్స్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసాడు. అయితే ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ బంతిని అందుకొని నాన్ స్ట్రైక్ ఎండింగ్ వైపు బలంగా విసిరాడు. ఆ వేగానికి కృనాల్ కూడా బంతిని అందుకోలేకపోయాడు. దీంతో ఢిల్లీ బ్యాట్స్మెన్ మరో రన్ తీసారు. అనవసర పరుగు వచ్చేలా చేసిన హార్దిక్ను కృనాల్ కసురుకున్నాడు. బ్యాట్స్మెన్ క్రీజులోకి వచ్చిన తర్వాత త్రో కొట్టాల్సిన అవసరం ఏం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక హార్దిక్ కు కూడా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. బ్యాకప్గా ఫీల్డర్ ఉన్నాడనే త్రో విసిరానని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వినిపించుకొని కృనాల్ బర్త్డే బాయ్ను మందలించాడు. ఇక ఈ మ్యాచ్ లో కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (52 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించారు. తర్వాత ముంబై ఇండియన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' డికాక్ (36 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ (32 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు.