50 శాతం మందికి చాన్స్:
తమ దేశంలో జరిగే ఐపీఎల్ 2020 మ్యాచ్లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతిస్తామని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తాజాగా తెలిపింది. తమ దేశంలో కరోనా అదుపులోనే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆమోదం లభిస్తే... స్టేడియంలోని సీటింగ్ సామర్థ్యంలో 30 నుంచి 50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉందని ఈసీబీ కార్యదర్శి ముబాషిర్ ఉస్మాని చెప్పారు. అయితే ప్రేక్షకులను అనుమతిస్తే.. కరోనా వ్యాప్తి చెంది, ఆటగాళ్లు ప్రమాదంలో పడేందుకు ఆస్కారమున్న నేపథ్యంలో బీసీసీఐ ఇందుకు అంగీకరిస్తుందో లేదో చూడాలి.
ప్రేక్షకులు ఉండాలనే కోరుకుంటున్నాం:
'ముందు మా దగ్గర ఐపీఎల్ 2020 నిర్వహించేందుకు భారత ప్రభుత్వం అధికారికంగా అనుమతించాలి. బీసీసీఐ ఆ విషయాన్ని ధ్రువీకరించాలి. తర్వాత లీగ్ను నిర్వహించేందుకు తయారు చేసిన విధి విధానాలను మా ప్రభుత్వం ముందుంచుతాం. మా దేశంలో పూర్తిస్థాయిలో జరిగే ఐపీఎల్లో కచ్చితంగా ప్రేక్షకులు ఉండాలనే కోరుకుంటున్నాం. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని ప్రత్యక్షంగా ఆస్వాదించే అవకాశాన్ని మా ప్రజలకు ఇవ్వాలనే భావిస్తున్నాం. కానీ అది ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది' అని ఎమిరేట్స్ బోర్డు కార్యదర్శి ముబాషిర్ ఉస్మాని తెలిపారు. యూఏఈలో కరోనా నియంత్రణలోనే ఉంది. ప్రస్తుతం 6000 కేసులే ఉన్నాయి.
240 పేజీలతో ఎస్వోపీ:
లీగ్లో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీలు ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్వోపీ) పాటించేలా కఠిన నిబంధనల అమలుకు బోర్డు సిద్ధమైంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ)లో చర్చించడమే ఆలస్యం ఎస్వోపీ మార్గదర్శకాలను బోర్డు విడుదల చేసేందుకు సన్నద్ధతతో ఉంది. లీగ్ను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధమైన బీసీసీఐ అందుకు తగ్గట్లు ఎస్వోపీని తయారు చేసింది. యూఏఈలో అడుగుపెట్టిన క్షణం నుంచి లీగ్ పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో 240 పేజీలతో కూడిన సుదీర్ఘ ఎస్వోపీ మార్గదర్శకాలను సిద్ధం చేసింది. దీని ప్రకారం ప్రారంభోత్సవంలో ఆటగాళ్లు ఎంత దూరం నిల్చోవాలి అన్న దగ్గర మొదలుపెడితే మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే ప్రజెంటేషన్లో ఎలా వ్యవహరించాలో బొమ్మలతో సహా రూపొందించింది.
ఆటగాళ్ల కోసం హెల్ప్లైన్:
దాదాపు రెండు నెలల పాటు బయో బబుల్ వాతావరణంలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే ఆటగాళ్ల కోసం బీసీసీఐ హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం తెలిసింది. ఉత్కంఠభరితంగా సాగే లీగ్లో ఒక ప్రత్యేకమైన వాతావరణానికి పరిమితమవడంతో కలిగే ఒత్తిడి, బెంగ నుంచి ఉపశమనం కల్గించేందుకు మానసిక నిపుణులతో బోర్డు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఎవరికైనా సమస్యలుంటే హెల్ప్లైన్ ద్వారా సలహాలు, సూచనలు తీసుకోవచ్చు.
ఎన్ని వైరస్లు వచ్చినా మేం భయపడం.. యూ కాంట్ స్టాప్ అస్ (వీడియో)