
కొలంబో: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ముందు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, గత సీజన్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన లసిత్ మలింగా ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. గురువారం యూఏఈ వెళ్లిన ముంబై ఆటగాళ్లతో మలింగా వెళ్లలేదని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల మలింగ ఆలస్యంగా యూఏఈకి వెళ్లనున్నట్లు పేర్కొంది.
మలింగా తండ్రి అనారోగ్యానికి గురయ్యారని, త్వరలోనే ఆయనకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రస్తుతం కొలంబోలోనే ఉన్న మలింగా ప్రాక్టీస్ మాత్రం చేస్తున్నాడని, ఈ సీజన్ ఎండింగ్లో జట్టుతో కలిసే అవకాశం ఉందని బాంబు పేల్చింది. సరిగ్గా చెప్పాలంటే ప్లే ఆఫ్స్ సమయంలో జట్టుతో చేరనున్నాడని పేర్కొంది. ఆ సమయంలో మలింగా అనుభవం కలిసొస్తుందని ముంబై మేనేజ్మెంట్ కూడా భావిస్తుందని తెలిపింది.

గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్ వేసిన మలింగా 8 పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థిని అద్భుతంగా కట్టడి చేశాడు. ఇక అదే మ్యాచ్లో తొలి మూడు ఓవర్లలో 42 పరుగులు ఇచ్చుకున్న లంక బౌలర్.. ఫైనల్ ఓవర్లో మాత్రం 8 పరుగులు ఇవ్వకుండా చెన్నై విజయాన్ని అడ్డుకున్నాడు. తొలి ఐదు బంతులకు ఏడు రన్స్ ఇచ్చిన మలింగా.. చివరి బంతికి శార్దుల్ ఠాకుర్ను ఔట్ చేసి ఒక్క పరుగుతో ముంబైకి అద్భుత విజయాన్నందించాడు. ఇక చివరి బంతికి రెండు పరుగులు చేయలేక చెన్నై ఓటమికి తలవొంచగా.. ముంబై నాలుగు టైటిళ్లు గెలిచి సగర్వంగా తలెత్తుకుంది.
కరోనా నేపథ్యంలో శ్రీలంకలో విధించిన నిబంధనలే మలింగాను ఈ ఐపీఎల్ సీజన్కు దూరం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్న తండ్రిని వదిలేసి దుబాయ్కు వెళ్లి మ్యాచ్లు ఆడినా.. ఊహించని పరిణామాలతో మళ్లీ కొలంబో రావల్సి వస్తే శ్రీలంక ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ పాటించాలి. ఈ కారణంగానే మలింగా రిస్క్ చేయదల్చుకోవడం లేదని, తండ్రిని దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాడని క్రిక్ఇన్పో పేర్కొంది.