
దుబాయ్: సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విలవిలలాడింది. పసలేని బ్యాటింగ్తో పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దాంతో ఆరెంజ్ ఆర్మీ ముందు 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ నుంచి లభించిన సహకారంతో సందీప్ శర్మ(2/29), జాసన్ హోల్డర్(2/27), రషీద్ ఖాన్(2/14) చెలరేగడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 రన్స్ చేసింది. నికోలస్ పూరన్ (32 నాటౌట్) కేఎల్ రాహుల్(27), క్రిస్ గేల్(20), టాప్ స్కోరర్లుగా నిలిచారు. సుమారు 70 బంతుల తర్వాత కానీ ఆ జట్టు ఫోర్ కొట్టలేదంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎంత బోరింగ్గా ఉందో తెలుస్తోంది. ఇన్నింగ్స్ మొత్తం 7 ఫోర్లు, రెండు సిక్స్లు మాత్రమే వచ్చాయి.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు శుభారంభం దక్కలేదు. మయాంక్ అగర్వాల్ గైర్హాజరీతో జట్టులోకి వచ్చిన మన్దీప్ సింగ్(17) అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. సందీప్ శర్మ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ వికెట్తో సందీప్ ఐపీఎల్లో తన 100వ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్(20)తో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(27) బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
దాంతో పవర్ప్లే ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 47 రన్స్ చేసింది. అయితే క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని జాసన్ హోల్డర్ దెబ్బతీశాడు. గేల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. రషీద్ ఖాన్ వేసిన ఆ మరుసటి బంతికే రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పంజాబ్ పతనం మొదలైంది. ఆ వెంటనే మాక్స్వెల్(12), దీపక్ హుడా(0), క్రిస్ జోర్డాన్(7), మురుగన్ అశ్విన్(4) కూడా తీవ్రంగా నిరాశపరిచారు. చివర్లో పూరన్ రెండు ఫోర్లు కొట్టడంతో పంజాబ్ 126 పరుగులు చేయగలిగింది.