గేల్ జిగేల్:
లక్ష్య ఛేదనలో పంజాబ్ తడబడింది. తొలి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన కేఎల్ రాహుల్ (15; 11 బంతుల్లో 1×4, 1×6) జట్టు స్కోరు 17 వద్ద ఔటయ్యాడు. మరోవైపు మయాంక్ అగర్వాల్ ఆచితూచి ఆడాడు. రాహుల్ అనంతరం క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ పేసర్ తుషార్ దేశ్పాండే వేసిన 5 ఓవర్ను లక్ష్యంగా చేసుకున్నాడు. వరుసగా 4, 4, 6, 4, 6 బాది స్కోరు బోర్డునుపరుగులు పెట్టించాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే గేల్ను స్పిన్నర్ ఆర్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక నికోలస్ పూరన్ సమన్వయ లోపంతో మయాంక్ (5) రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
పూరన్ హాఫ్ సెంచరీ:
56 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్ గెలుపుపై కాసేపు అనుమానాలు నెలకొన్నాయి. అయితే నికోలస్ పూరన్.. గ్లెన్ మాక్స్వెల్తో కలిసి నాలుగో వికెట్కు 69 పరుగుల భారీ భాగస్వామ్యం అందించాడు. తుషార్ వేసిన తొమ్మిదో ఓవర్లో పూరన్ వరుసగా సిక్స్, రెండు ఫోర్లు బాది 15 పరుగులు సాధించాడు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పూరన్.. 27 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రబాడ వేసిన 13వ ఓవర్లో అనూహ్యంగా బంతి గ్లోవ్స్కు తాకి వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో మాక్స్వెల్ జట్టును ముందుండి నడిపించాడు. మళ్లీ రబాడ బౌలింగ్లోనే మాక్స్వెల్ భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు.
నీషమ్ సిక్సర్:
వికెట్లు పడుతున్నా పంజాబ్ సమీకరణం 18 బంతుల్లో 14గా మారింది. సాధించాల్సిన రన్రేట్ తక్కువగా ఉండటంతో దీపక్ హుడా (15 నాటౌట్), జేమ్స్ నీషమ్ (10; 8 బంతుల్లో 1×6) జట్టుకు విజయాన్నందించారు. 19వ ఓవర్ చివరి బంతికి నీషమ్ సిక్స్ బాదాడు. ఢిల్లీ బౌలర్లలో రబడా రెండు వికెట్లు సాధించగా.. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్లకు తలో వికెట్ లభించింది. పంజాబ్ వరుసగా మూడో విజయం సాధించింది. అంతేకాదు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగానే ఉంచుకుంది.
ధావన్ సెంచరీ:
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (106 నాటౌట్: 61 బంతుల్లో 12ఫోర్లు, 3సిక్సర్లు) మరో అద్భుత ప్రదర్శన చేశాడు. తన సహచరులు బంతిని టైమింగ్ చేసేందుకే ఇబ్బంది పడుతున్న పిచ్పై వరుస బౌండరీలు, భారీ సిక్సర్లతో దుమ్మురేపాడు. ఢిల్లీల్లో మిగతా బ్యాటర్లు 59 బంతుల్లో చేసింది 58 పరుగులే. ధావన్కు శ్రేయస్ అయ్యర్ (14), రిషబ్ పంత్ (14) కాస్త సహకారం అందించారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు తీయగా.. మాక్స్వెల్, నీషమ్, మురుగన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.
KXIP vs DC: ఐపీఎల్లో ఐదువేల పరుగులు.. ఐదో ప్లేయర్గా శిఖర్ ధావన్ రికార్డు!!