
అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్ తుది దశకు చేరుకుంది. టైటిల్ రేసు నుంచి ముందే తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తమ ఆఖరి మ్యాచ్ కూడా ఆడేస్తుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే అనూహ్య నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ ఆడటంపై క్లారిటీ ఇచ్చాడు.
ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇది చివరి మ్యాచ్ కాదు కదా? అని హోస్ట్ డానీ మోర్రిసన్ అడిగిన ప్రశ్నకు ధోనీ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఖచ్చితంగా కాదని బదులిచ్చాడు. దాంతో ధోనీ వచ్చే సీజన్ ఆడటంపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక మహీ ఎవరూ ఊహించని విధంగా 2014లో టెస్ట్ క్రికెట్కు.. ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే ఐపీఎల్కు కూడా దూరమవుతాడా? అనే సందేహంతో కామెంటేటర్ మహీని ఈ ప్రశ్న అడిగాడు.
ఇప్పటికే ఆ జట్టు సీఈవో కాశీ విశ్వానాథన్ రాబోయే సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ను ధోనీనే నడిపిస్తాడని తెలిపాడు. 'చెన్నైకి మహీ మూడు టైటిల్స్ అందించాడు. తొలిసారి చెన్నై ప్లేఆఫ్కి అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్లో ఏ జట్టు కూడా ఆడిన ప్రతి సీజన్లోనూ ప్లేఆఫ్కి చేరలేదు. ఈ సీజన్లో విఫలమైనంత మాత్రానా అన్నీ మార్చేస్తారనుకోవడం పొరపాటు'అని తెలిపాడు.
ఐపీఎల్-2020 టోర్నమెంట్ ప్రారంభానికి ముందు టైటిల్ హాట్ ఫేవరెట్గా కనిపించిన చెన్నై సూపర్ కింగ్స్.. అనూహ్యంగా చతికిల పడింది. తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడలేకపోయింది. తొలి మ్యాచ్లో బోణీ కొట్టినప్పటికీ.. అదే దూకుడును కొనసాగించలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్.. చివరికి ఫీల్డింగ్లోనూ ఆకట్టుకోలేకపోయింది. ప్రత్యర్థికి తగ్గట్టు వ్యూహాలను రచించలేకపోయింది. ఇప్పటిదాకా 13 మ్యాచ్లను ఆడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఎనిమిదింట్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి ఘనంగా ఈ సీజన్ను ముంగించాలని భావిస్తోంది. దాంతో పాటు పంజాబ్ను వెంట తీసుకెళ్లాలనుకుంటుంది.