
దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 63) హాఫ్ సెంచరీకి తోడు నికోలస్ పూరన్(17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 33) మెరుపులు మెరిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు 179 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ ఇద్దరికి తోడు మన్దీప్ సింగ్(27), మయాంక్ అగర్వాల్(26) పర్వాలేదనిపించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది.
ఒకానొక దశలో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లిన కింగ్స్ పంజాబ్.. డెత్ ఓవర్లలో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 200 మార్క్ను అందుకోలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో శార్ధుల్ ఠాకుర్ రెండు వికెట్లు తీయగా.. జడేజా ఓ వికెట్ తీశాడు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్(26) మంచి శుభారంభాన్ని అందించారు.
ఓవర్కో బౌండరీ రాబట్టడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వికెట్ నష్టపోకుండా 46 రన్స్ చేసింది. అనంతరం చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోర్ బోర్డు వేగం తగ్గింది. ఈ ఒత్తిడిలో పియూష్ చావ్లా వేసిన 8వ ఓవర్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడిన మాయంక్ అగర్వాల్ సామ్ కరన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
క్రీజులోకి వచ్చిన మన్దీప్ సింగ్(27)తో రాహుల్ నిదానంగా ఆడాడు. మరోవైపు చావ్లా వేసిన 11వ ఓవర్లో మన్దీప్ సింగ్ రెండు సిక్సర్ల కొట్టి 17 రన్స్ పిండుకున్నాడు. అయితే జడేజా వేసిన ఆ మరుసటి ఓవర్లోనే ఎక్స్ట్రా కవర్స్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. వికెట్ కోల్పోయినా నికోలస్ పూరన్, రాహుల్ ధాటిగా ఆడారు. జడేజా బౌలింగ్లో పూరన్ 4,6 కొట్టగా.. శార్ధుల్ ఠాకుర్ వేసిన 14 ఓవర్ రెండో బంతిని లాంగాఫ్లో భారీ సిక్సర్గా మలిచి రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అనంతరం రెండు వరుస బౌండరీలతో విరుచుకుపడటంతో 16 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత వరుస ఓవర్లో పూరన్ రెండు సిక్స్లు కొట్టి దూకుడుగా కనిపించాడు. అదే ఊపులో ఠాకుర్ వేసిన 18వ ఓవర్ తొలి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు.ఈ హై క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద జడేజా అద్భుతంగా అందుకోవడంతో పూరన్(33) నిరాశగా వెనుదిరిగాడు.
ఆ వెంటనే కేఎల్ రాహుల్ (63) కూడా ఔటవ్వడంతో పంజాబ్ స్కోర్ వేగం తగ్గింది. 17, 18 ఓవర్లలో 14 పరుగులే చేసిన పంజాబ్.. చివరి ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్(14 నాటౌట్) వరుస బౌండరీలు కొట్టడంతో 12 పరుగులు వచ్చాయి.