
దుబాయ్: సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని, ఆ ఆనందాన్ని వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. శనివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 12 పరుగుల తేడాతో హైదరాబాద్పై గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్.. తమ విజయంలో సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉందన్నాడు.
'మేం గెలవడం అలవాటు చేసుకుంటున్నాం. అయితే, ఫస్టాఫ్లో ఇలా చేయలేకపోయం. నిజం చెప్పాలంటే ఇప్పుడు మాటలు రావడం లేదు. మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది. లోస్కోరింగ్ గేమ్లో పరుగుల విలువేంటో తెలుస్తోంది. డైవింగ్ స్టాప్స్తో పరుగులను అడ్డుకోవడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఇదంతా ఆటగాళ్ల వల్లనే కాదు. బ్యాక్ ఎండ్లో సహాయక సిబ్బంది పాత్ర కీలకం. మా విజయంలో కూడా సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉంది. రెండు నెలల్లో ఆటగాళ్లని పూర్తిగా తీర్చిదిద్దలేకపోయినా మానసికంగా ఎంతో దృఢంగా చేయొచ్చు. అదే మా కోచ్ అనిల్కుంబ్లే చేశారు.
మేం బ్యాటింగ్ చేసేటప్పుడు తొలి ఓవర్ పూర్తయ్యేసరికే పిచ్ కఠినంగా ఉందని అర్థమైంది. ఇది హై స్కోరింగ్ పిచ్ కాదని బోధపడింది. దాంతో 160 పరుగులు చేస్తే సరిపోతుందని నేను, మన్దీప్ సింగ్ అనుకున్నాం. ఇక ఛేదనలో హైదరాబాద్ ధాటిగా ఆరంభించింది. పవర్ప్లేలో రెచ్చిపోయింది. అయితే, తమ టీమ్లో ఇద్దరు లెగ్స్పిన్నర్లు ఉన్నందున ఎక్కువ పరుగులు ఇవ్వకపోతే మ్యాచ్పై పట్టుసాధించే అవకాశం ఉన్నట్లు ముందే ఊహించా. టోర్నీ ప్రారంభానికి ముందే నేను కోచింగ్ టీమ్తో బౌలర్లను ఏం కావాలో చర్చించాం. దానికి తగ్గట్లే ఈ మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ చెలరేగాడు. ఒత్తిడిని అధిగమిస్తూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ పెర్ఫామెన్స్తో అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. నికోలస్ పూరన్ (28 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. రషీద్ ఖాన్ (2/14) కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్మెన్ పని పట్టగా... హోల్డర్, సందీప్ కూడా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే దూకుడుగా ఆడాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' క్రిస్ జోర్డాన్ (3/17), అర్ష్ దీప్ సింగ్ (3/23) పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.