దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన కోల్కతా 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై వీరి భవితవ్యం ఆధారపడి ఉంది. ఇక మ్యాచ్ను త్వరగా ముగించాలనే ఆతృతలో వికెట్లు పారేసుకున్న రాజస్థాన్ ఓటమితో ఈ సీజన్ను ముగించింది. రన్రేట్ కారణంగా రాజస్థాన్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగులో నిలిచింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68), రాహుల్ త్రిపాఠి(39) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆర్చర్, శ్రేయస్ గోపాల్ చెరొక వికెట్ తీశారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131పరుగులే చేసి ఓటమిపాలైంది. జోస్ బట్లర్(35), రాహుల్ తెవాటియా(31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కోల్కతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ (4/34) నాలుగు వికెట్లు తీయగా.. శివం మావి, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీశారు. నాగర్ కోటికి ఒక వికెట్ దక్కింది.
192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. రాబిన్ ఊతప్ప(6), బెన్ స్టోక్స్(18), స్మిత్ (4), సంజూ శాంసన్ (1), రియాన్ పరాగ్ దారుణంగా విఫలమయ్యారు. దాంతో రాజస్థాన్ 37 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రాజస్థాన్ 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ జోస్ బట్లర్(35), రాహుల్ తెవాటియా బాధ్యతాయుతంగా ఆడారు. ఇక 6వ వికెట్కు 43 పరుగులు జోడించిన తర్వాత బట్లర్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి ఔటవ్వడంతో కోల్కతా విజయం లాంఛనమైంది.