దుబాయ్: ఇయాన్ మోర్గాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68) చెలరేగడంతో కోల్కతా నైట్రైడర్స్.. రాజస్థాన్ రాయల్స్ ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మోర్గాన్కు తోడుగా రాహుల్ త్రిపాఠి(39), శుభ్ మన్ గిల్(39), రస్సెల్(25) రాణించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆర్చర్, శ్రేయస్ గోపాల్ చెరొక వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు కోల్కతాకు శుభారంభం దక్కలేదు. ఫస్ట్ ఓవర్లోనే నితీష్ రాణా గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. అనంతరం శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి బాధ్యతాయుతంగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ఇక క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని రాహుల్ తెవాటియా విడదీసాడు. శుభ్మన్ గిల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చడంతో తొలి వికెట్కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అదే ఓవర్ ఆఖరి బంతికి సునీల్ నరైన్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కొద్దిసేపటికే రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్(0)లు కూడా పెవిలియన్ బాట పట్టారు. దాంతో కోల్కతా 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఇయాన్ మోర్గాన్తో జత కలిసి కలిసిన రస్సెల్(11 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్తో 25) ధాటిగా ఆడి రన్ రేట్ తగ్గకుండా చూశాడు.
అయితే కార్తీక్ త్యాగీ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో 6వ వికెట్కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక క్రీజులోకి వచ్చిన కమిన్స్తో మోర్గన్ చెలరేగాడు. 19వ ఓవర్లో 6, 6, 6, 4తో 19 పరుగులు పిండుకోవడంతో పాటు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి ఓవర్లో కమిన్స్ ఔటైనా..భారీ సిక్సర్తో ఇన్నింగ్స్ను ముంగించాడు.