
7 బంతులు మిగిలుండగానే..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 రన్స్ చేసింది. శుభ్మన్ గిల్(45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 57), ఇయాన్ మోర్గాన్(25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40) రాణించారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ(3/35) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్(2/25), రవి బిష్ణోయ్ (2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. అశ్విన్, మ్యాక్స్వెల్కు చెరొక వికెట్ దక్కింది. అనంతరం పంజాబ్ 18.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి సునాయస వియాన్నందుకుంది. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, ఫెర్గూసన్ తలో వికెట్ దక్కింది.

గుడ్ స్టార్ట్..
అంతకుముందు 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్కు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(27), మన్దీప్ సింగ్ నిదానంగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని వరుణ్ చక్రవర్తి విడదీశాడు. రాహుల్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్తో మన్దీప్ సింగ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మొదట్లో నిదానంగా ఆడిన ఈ జోడీ ఆ తర్వాత జోరు పెంచింది.

జి'గేల్'..
ముఖ్యంగా గేల్ తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు మన్దీప్ నిదానంగా ఆడుతున్నా.. మరో ఎండ్లో గేల్ మెరుపులు మెరిపించాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన 16వ ఓవర్లో ఫోర్, సింగిల్తో మన్దీప్ సింగ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ స్పెషల్ ఇన్నింగ్స్ను తన తండ్రికి అంకితమిచ్చాడు. ఇక ఫెర్గూసన్ వేసిన 17 ఓవర్లో 4, 6 కొట్టిన గేల్ .. సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో గేల్ ఔటైనా.. మన్దీప్ మిగతా పనిని పూర్తి చేశాడు.


Click it and Unblock the Notifications












