అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ అద్భుత విజయాన్నందుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన కేకేఆర్ 59 పరుగులతో పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. చావోరేవో మ్యాచ్లో అద్భుత విజయంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. నితీష్ రాణా( 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్తో 81), సునీల్ నరైన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 64) అదరగొట్టారు. ఢిల్లీ బౌలర్లలో రబడా, నోర్జ్, స్టోయినిస్ రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ వరుణ్ చక్రవర్తి(5/20), ప్యాట్ కమిన్స్(3/17) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కోల్కతా బౌలర్లలో వరుణ్, కమిన్స్కు తోడుగా ఫెర్గూసన్ ఓ వికెట్ తీశాడు.
ఇక 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓపెనర్గా బరిలోకి దిగిన అజింక్యా రహానే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అతని మరుసటి ఓవర్లో సెంచరీల హీరో శిఖర్ ధావన్(6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 36 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో రిషబ్ పంత్(27), శ్రేయస్ అయ్యర్ (47) నిదానంగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ వరుణ్ చక్రవర్తి అద్భుత బౌలింగ్తో పంత్ను పెవిలియన్ చేర్చాడు.
దాంతో మూడో వికెట్కు నమోదైన 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే హెట్మైర్ (10), శ్రేయస్ అయ్యర్ (47) కూడా ఔటవ్వడంతో ఢిల్లీ వికెట్ల పతనం మొదలైంది. స్టోయినిస్ (6), అక్షర్ పటేల్ (9), కగిసో రబడా(9), దేశ్పాండే(1) తీవ్రంగా నిరాశపరిచారు. అశ్విన్(14 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ.. కోల్కతా విజయం ఆగలేదు.