
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభానికి ఇంకా 15 రోజులే ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తొలుత ఆ జట్టుకు కరోనా సెగ తగలడం.. ఆ తర్వాత స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా తప్పుకోవడం.. తాజాగా హర్భజన్ సింగ్ కూడా వైదొలగడంతో సీఎస్కే ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ విపత్కర కాలంలో ఫ్యామిలీతో ఉండటమే ముఖ్యమని భావించి ఈ సీజన్లో పాల్గొనడం లేదని భజ్జీ వెల్లడించాడు.
అయితే హర్భజన్ సింగ్ తప్పుకోవడంతో చెన్నై జట్టుకు ఆఫ్ స్పిన్నర్ల కొరత ఏర్పడనుంది. ప్రస్తుత జట్టులో కేదార్ జాదవ్ ఒక్కడే ఆఫ్ స్పిన్నర్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ సీనియర్ స్పోర్ట్స్ రిపోర్టర్ ట్వీట్ చేశాడు.'హర్భజన్ వైదొలగడంతో ఆ స్థాయి ఆఫ్ స్పిన్నర్ సీఎస్కేలో మరెవరూ లేరు. కేదార్ జాదవ్ ఒక్కడే ఉన్నాడు. మిగతావారంతా లెఫ్టార్మ్ స్పిన్నర్లే.'అని పేర్కొన్నాడు. అయితే ఈ ట్వీట్పై స్పందిస్తూ మనోజ్ తివారీ.. బెంగాల్, ఢిల్లీ మధ్య జరిగిన ఓ రంజీ మ్యాచ్లో తాను చేసిన బౌలింగ్ వీడియోను పంచుకున్నాడు. ఇది పనిచేస్తుందా? అని ప్రశ్నించాడు. దీంతో మనోజ్ తివారీ.. సీఎస్కే జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడా? అనే ప్రచారం ఊపందుకుంది.