
హైదరాబాద్ మ్యాచ్లో బరిలోకి:
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మ.. తొడ కండరాల గాయంతో వరుసగా నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇదే సమయంలో సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. అతడిని ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చినట్లు పేర్కొంది. అయితే ఆ తర్వాతి రోజే ముంబై ప్రాక్టీస్ సెషన్స్లో రోహిత్ శ్రమిస్తున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. మరోవైపు ప్రాధాన్యం లేని మంగళవారం నాటి మ్యాచ్ (సన్రైజర్స్ హైదరాబాద్) కోసం అతడు బరిలో దిగాడు. దీంతో క్రీడా వర్గాల్లో అతని గాయంపై సందేహాలు మొదలయ్యాయి. ఇక గతరాత్రి మ్యాచ్కు ముందు 'అంతా బాగుంది. నేను ఫిట్గా, చురుగ్గా ఉన్నాను' అంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

దేశం తరఫున ఆడటం కంటే ఐపీఎల్ ముఖ్యమా:
తాజాగా దిలీప్ వెంగ్సర్కార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... 'టీమిండియాకు ఎంతో ముఖ్యమైన ఆటగాడు రోహిత్ శర్మ అన్ఫిట్గా ఉన్నాడని కొద్ది రోజుల క్రితం భారత జట్టు ఫిజియో (నితిన్ పటేల్) తేల్చిచెప్పాడు. గాయం కారణంగా అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదు. ఇప్పుడు ఐపీఎల్లో ముంబైకి ఆడటమే కాదు, నాయకత్వం కూడా వహిస్తున్నాడు. అసలు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. భారత జాతీయ జట్టుకు ఆడటం కంటే ఐపీఎల్ అతనికి ముఖ్యమా? దేశం కోసం ఆడటం కన్నా క్లబ్ ముఖ్యమా? దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుంది. రోహిత్ గాయాన్ని సరిగ్గా గుర్తించడంలో బీసీసీఐ ఫిజియో ఏదైనా పొరపాటు చేశారా?' అని పలు ప్రశ్నలను సంధించారు

బీసీసీఐపై సెహ్వాగ్ కూడా ఫైర్:
వీరేంద్ర సెహ్వాగ్ కూడా బీసీసీఐపై మండిపడ్డారు. 'రోహిత్ శర్మ పరిస్థితి ఏంటో కోచ్ రవిశాస్త్రికి తెలియకుండా ఉండే అవకాశం లేదు. సెలక్షన్ కమిటీలో రవిశాస్త్రి భాగం కానప్పటికీ.. ఎంపికకు రెండు మూడు రోజుల ముందైనా అతని అభిప్రాయమేంటో సెలక్టర్లైనా మాట్లాడి ఉంటారు. ఆయన నుంచి కొన్ని సూచనలు స్వీకరిస్తారు. నిజానికి రోహిత్ గాయపడి ఉంటే అతడి స్థానంలో మరెవరినైనా ప్రత్యామ్నాయంగా ప్రకటించాలి. కానీ బీసీసీఐ అలా చేయలేదు. అంతేకాదు అతడికీ జట్టులో చోటివ్వలేదు. ఇదే నాకు అర్థం కావడం లేదు. ఈ ఏడాది వింతగా ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారు?.. రోహిత్ హైదరాబాద్పై మ్యాచ్ ఆడాడు. ముంబై ప్లేఆఫ్స్ వెళ్లింది. అక్కడ కూడా అతడు ఆడతాడు. దృఢంగా ఉన్నానని రోహిత్ అంటున్నాడు. అలాంటప్పుడు ఎందుకు ఎంపిక చేయడం లేదు' అని మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ప్రశ్నించారు.

తొందరపడొద్దని దాదా సూచన:
రోహిత్ శర్మ ఐపీఎల్ కోసం తొందరపడొద్దని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించాడు. ఈ ఒక్క లీగ్ కోసం భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సూచించాడు. రోహిత్ లాంటి పరిణతి చెందిన ఆటగాడికి ఇవన్నీ ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నాడు. అయితే గంగూలీ సలహా ఇచ్చిన రోజే రోహిత్ మైదానంలోకి దిగి ఒక రకంగా బోర్డును ఎగతాళి చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించిన అక్టోబర్ 26 నుంచి రోహిత్ విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా రోహిత్ గాయం విషయంపై బోర్డు ఒక స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం దీనిని మరింతగా పెంచింది.


Click it and Unblock the Notifications

ఒక్క వన్డే ఆడకున్నా.. టాప్లోనే విరాట్ కోహ్లీ!!










