
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్లోనే ఉన్నాడు. కరోనా మహమ్మారి వల్ల గత మర్చి నుంచి కోహ్లీ కనీసం ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ బ్యాట్స్మెన్ జాబితాలో విరాట్ 871 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ ఖాతాలో 855 పాయింట్లు ఉన్నాయి. వన్డే బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు చాలా కాలం నుంచి హవా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
పాకిస్థాన్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ అనంతరం ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకటించింది. జింబాబ్వేతో సిరీస్లో 221 పరుగులు సాధించిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్.. వీరిద్దరి ర్యాంకులపై కన్నేశాడు. సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన బాబర్ (837 పాయింట్ల) ఎనిమిది పాయింట్లు సాధించి మూడో ర్యాంకులో నిలిచాడు.రాస్ టేలర్ (818), ఫాఫ్ డుప్లెసిస్ (790) టాప్-5లో ఉన్నారు.
ఐసీసీ వన్డే బౌలర్ల జాబితాలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (719) రెండో ర్యాంకులో ఉన్నాడు. న్యూజీలాండ్ స్టార్ పేసర్ టెంట్ బౌల్ట్ (722) టాప్లో కొనసాగుతున్నాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (701), క్రిస్ వోక్స్ (675), కగిసో రబాడా (665) టాప్-5లో ఉన్నారు. ఆల్రౌండర్ల జాబితాలో షకీబ్ అల్ హసన్ (373) అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ తొమ్మిదిలో కొనసాగుతున్నాడు.
యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు ఆడుతున్నారు. ఐపీఎల్ 2020 ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు నవంబర్ 12న ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది. ఈ టూర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. కరోనా విరామం అనంతరం టీమిండియా ఆడుతున్న మొదటి సిరీస్ ఇదే.