
దుబాయ్: ఐపీఎల్-13 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజయాన్నందుకుంది. గెలవాలనే కసితో బరిలోకి దిగిన ధోనీ సేన బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టిగా రాణించి సన్రైజర్స్ హైదరాబాద్పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్లో హైదరాబాద్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది.
షేన్ వాట్సన్(38 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 42), అంబటి రాయుడు (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 41), ధోనీ(13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 21), రవీంద్ర జడేజా(10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 25 నాటౌట్) రాణించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులకే పరిమితమైంది. కేన్ విలియమ్సన్(39 బంతుల్లో 7 ఫోర్లు 57) మినహా అంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో కరన్ శర్మ, బ్రావో రెండేసి వికెట్లు తీయగా.. సామ్ కరన్, జడేజా, ఠాకుర్ తలో వికెట్ తీశారు. ఈ పరాజయంతో హైదరాబాద్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు మంచి ఆరంభం దక్కలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(9) సామ్ కరన్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే వచ్చిరావడంతోనే ఫోర్ కొట్టాడు. కానీ ఆ వెంటనే డ్వేన్ బ్రావో సూపర్ ఫీల్డింగ్కు రనౌట్గా వెనుదిరిగాడు. దాంతో హైదరాబాద్ పవర్ ప్లే ముగిసే సమాయనికి 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.
కొద్దిసేపటికే బెయిర్ స్టో(23) కూడా ఔటవ్వడంతో 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి హైదరాబాద్ కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కేన్ విలియమ్సన్.. యువ ఆటగాడు ప్రియమ్ గార్గ్తో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ఈ జోడీ 40 పరుగుల భాగస్వామ్యాన్ని అందించగానే గార్గ్ను కరన్ శర్మ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్(12) ఓ సిక్సర్ కొట్టి మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరోవైపు విలియమ్సన్ తనదైన శైలిలో ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అదే జోరులో భారీ షాట్కు ప్రయత్నించిన కేన్.. కరన్ శర్మ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే రషీద్ సిక్స్, ఫోర్ కొట్టగా.. నదీమ్ మరో ఫోర్ కొట్టాడు. దాంతో చివరి 12 బంతుల్లో హైదరాబాద్ విజయానికి 27 పరుగులు అవసరమయ్యాయి. ఠాకుర్ 5 పరుగులే ఇచ్చి రషీద్ను హిట్ వికెట్గా పెవిలియన్ చేర్చాడు. చివరి ఓవర్లో 22 పరుగులు కావాల్సి ఉండగా బ్రావో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఒకే రన్ ఇచ్చి ఓ వికెట్ తీయడంతో చెన్నై విజయం లాంఛనమైంది.