
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ సామ్ కరన్పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో అద్భుతమైన ఆల్రౌండరని కొనియాడాడు. రోజు రోజుకు ఎంతో పరణితి కనబరుస్తున్న సామ్.. రాబోయే రోజుల్లో అన్ని ఫార్మాట్లలో టాప్ మోస్ట్ ఆల్రౌండర్గా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ వేలంలో దూకుడుగా ఉన్న దాఖలాలు లేవన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా వారు వేలంలో చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉందని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ ఫోతో మాట్లాడుతూ ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు.
'ఈ సీజన్లో సీఎస్కే లీగ్ దశ నుంచే నిష్క్రమించడంతో వచ్చే ఏడాది వేలానికి ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేసుకుంటుంది. వచ్చే ఏడాది కూడా ధోనీనే సారథిగా కొనసాగినప్పటికీ యువ క్రికెటర్లను ఎక్కువ టార్గెట్ చేస్తూ ఐపీఎల్ వేలానికి వెళ్తారు. తదుపరి సీజన్ కు సీఎస్కే జట్టులో చాలా మార్పులు జరగడం ఖాయం. రిటైన్ కానీ యువ క్రికెటర్లపై ఆ ఫ్రాంచైజీ గురిపెడుతుంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న చాలా మందిని తిరిగి రిటైన్ చేసుకుంటుంది. ఆ జాబితాలో సామ్ కరన్ముందుంటాడు. అతనో అద్భుతమైన ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సామ్ రోజు రోజుకు ఎంతో పరిణితి సాధిస్తూ కీలక ఆల్రౌండర్గా ఎదుగుతున్నాడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఇక కోల్కతా నైట్ రైడర్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో చెన్నై 6 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీశ్ రాణా (61 బంతుల్లో 87; 10 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించాడు. ఇన్గిడి 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రుతురాజ్ గైక్వాడ్ (53 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్లు) చెన్నై గెలిచేందుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడేయగా... జడేజా ఆఖర్లో సిక్సర్లతో జట్టును గెలిపించాడు. రాయుడు (20 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. ఈ ఓటమితో కోల్కతా నైట్రైడర్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.