దుబాయ్: ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు లేకుండానే శ్రేయస్ అయ్యర్ సేన బరిలోకి దిగగా.. ముంబై మాత్రం ఓ మార్పు చేసింది. రాహుల్ చాహర్ స్థానంలో జయంత్ యాదవ్ను జట్టులోకి తీసుకొచ్చింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ను ఓ సెంటిమెంట్ కలవరపెడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి పోవడంతో రోహిత్ సేన తొలుత ఫీల్డింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు టైటిల్ గెలిచిన ముంబై.. ఇప్పటి వరకు చేజింగ్లో టైటిల్ గెలవలేదు. ముంబై చాంపియన్గా నిలిచిన 2013, 2015, 2017, 2019 సీజన్లలో తొలుతే బ్యాటింగ్ చేసింది. అలాగే చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచిన 2011, 2013లో కూడా చేజింగ్లో విజయం సాధించలేదు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ 2010 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చేజింగ్ చేయలేకనే ఓటమిపాలైంది. మరీ ఈ మ్యాచ్లో ఫీల్డింగ్కు దిగిన ముంబై ఈ లెక్కను సరిచేస్తుందా? లేక ఢిల్లీకి దాసోహం అవుతుందో చూడాలి.
ఇక టాస్ ఓడిపోవడంపై రోహిత్ కూడా భిన్నంగా స్పందించాడు. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదన్నాడు. 'నిజాయితిగా చెప్పాలంటే నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. టాస్ ఓడిపోతానని ఏ మాత్రం ఊహించలేదు. ఈ వికెట్ బ్యాటింగ్కు అనుకూలం. అయితే మేం బౌలింగ్లో మంచి ఆరంభాన్ని అందుకుంటే పరిస్థితులు మాకు అనుకూలంగా ఉంటాయి. ఇక మరో ఫైనల్ ఆడటంపై సంతోషంగా ఉంది. అయితే గతం ఇక్కడ అనవసరం. ఫైనల్ గేమ్ ఒత్తిడి ఎప్పుడూ విభిన్నంగానే ఉంటుంది.
అయితే మా ఆటగాళ్లు ఇలాంటి ఒత్తిడిని ఇంతకు ముందు కూడా ఎదుర్కొన్నారు. వారు పరిస్థితులను అర్థం చేసుకోగలరు. మేం దీన్ని ఓ మాములు మ్యాచ్గానే ఫీలవుతున్నాం. మా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేస్తాం. ప్రతీ ఒక్కరూ ఫిట్గా ఉన్నారు. కానీ ఓ టాక్టికల్ చేంజ్ చేశాం. ఢిల్లీలో లెఫ్టార్మ్ బ్యాట్స్మన్ ఎక్కువగా ఉండటంతో రాహుల్ చాహర్ స్థానంలో జయంత్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకున్నాం. రాహుల్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతన్ని పక్కన పెట్టడం బాధగా ఉంది. కానీ జయంత్ యాదవ్ కూడా క్వాలిటీ బౌలరే.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.