
దుబాయ్: కరోనా నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్ తుది ఘట్టానికి చేరింది. ఆసాంతం అద్భుత వినోదం పంచిన లీగ్లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఈ టైటిల్ ఫైట్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో ఈ ట్రిక్ పనిచేసిందని, దాంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తమ జట్టు బలమే ఫాస్ట్ బౌలింగ్ అని, భారీ స్కోర్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టుతామన్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామన్నాడు.
ఇక టాస్ పెద్ద విషయమేం కాదని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఓ టాక్టికల్ మార్పు చేశామని, రాహుల్ చాహర్ స్థానంలో జయంత్ యాదవ్ తీసుకున్నామన్నాడు. ఢిల్లీలో లెఫ్టార్మ్ బ్యాట్స్మన్ ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు.
ఇక లీగ్ దశలో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్లతో పాటు తొలి క్వాలిఫయర్లో కూడా ముంబై జట్టే విజయం సాధించింది. అంతేకాకుండా నాలుగు బేసి సంవత్సరాల్లో (2013, 2015, 2017, 2019) చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ మళ్లీ గెలిస్తే వారి ఖాతాలో ఐదో టైటిల్ చేరుతుంది. ఇప్పటికే లీగ్పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ అత్యంత విజయవంతమైన టీమ్గా నిలిచిన రోహిత్ శర్మ బృందం ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తుంది.
'డేర్డెవిల్స్'గా విఫలమైన ఢిల్లీ... 'క్యాపిటల్స్'గా మారి గత ఏడాది మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మరింత మెరుగైన ప్రదర్శనతో తొలిసారి ఫైనల్కు చేరింది. ఐపీఎల్ నెగ్గని మూడు జట్లలో ఒకటైన ఢిల్లీ గెలిస్తే మొదటి ట్రోఫీ వారి చెంతకు చేరుతుంది. లీగ్లో టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం.
జట్లు :
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నీల్, జయంత్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
ఢిల్లీ: శిఖర్ ధవన్, మార్కస్ స్టొయినిస్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మయర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబె, కగిసో రబడా, ఆర్ అశ్విన్, అన్రిచ్ నోర్జ్.