
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ టైటిల్ స్పాన్సర్గా డ్రీమ్ 11 ఖారారైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. చైనా వస్తు బహిష్కరణ సెగతో ఆ దేశానికి చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ 'వివో' ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త స్పాన్సర్ కోసం వేట మొదలు పెట్టిన బీసీసీఐ వారం క్రితం ఆయా కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానించింది.
అయితే ఈ డీల్ కాలపరిమితి (ఆగస్టు 18 నుంచి డిసెంబర్ 31) నాలుగున్నర నెలలు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. బిడ్లకు ఆగస్టు 14 చివరి తేదీగా ప్రకటించిన బీసీసీఐ.. స్పాన్సర్షిప్ కోసం బిడ్ వేసే కంపెనీ టర్నోవర్ కనీసం రూ. 300 కోట్లు ఉండాలనే నిబంధన పెట్టింది. ఆగస్టు 18న కొత్త స్పాన్సర్ ఎవరో ప్రకటిస్తామని తెలిపింది.
దీంతో టైటిల్ స్ఫాన్సర్షిప్ కోసం భారత్కు చెందిన టాటా సన్స్, రిలయన్స్ జియో, బైజూస్, అన్అకాడమీ తదితర కంపెనీలతో పాటు డ్రీమ్ 11 ఫాంటసీ స్పోర్ట్స్ లాంటి సంస్థలు పోటీపడ్డాయి. నిన్నటి వరకు భారత దిగ్గజ సంస్థ టాటా సన్స్ టైటిల్ స్పాన్సర్ దక్కించుకుందనే వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచాం మేరకు డ్రీమ్ 11 కంపెనీ రూ.250 కోట్లకు ఈ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఔట్ లుక్ ఇండియా ఓ కథనాన్ని కూడా రాసింది. అలాగే ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్లు కూడా డ్రీమ్ 11కే హక్కులు దక్కాయని ట్వీట్ చేస్తున్నారు.
ఇక బిడ్ దాఖలు చేసిన కంపెనీల్లో అన్ అకాడమీ రూ.211 కోట్లు, టాటా సన్స్ రూ. 180 కోట్లు, బైజుస్ రూ. 125 కోట్లకు బిడ్ దాఖలు చేశాయని, అత్యధికంగా డ్రీమ్ 11 రూ.250 కోట్లు చెల్లిస్తామని ముందుకు రావడంతో టైటిల్ స్పాన్సర్ షిప్ ఆ సంస్థకు దక్కినట్లు ప్రచారం జరుగుతుంది. మరికొద్ది గంటల్లో బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.
ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్షిప్ కోసం బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. టైటిల్ స్ఫాన్సర్గా ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది కూడా వివోనే టైటిల్ స్ఫాన్సర్గా కొనసాగుతుందని.. మూడు వారాల క్రితం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. కానీ సరిహద్దు వివాదం కారణంగా బీసీసీఐ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. 'బాయ్కాట్ ఐపీఎల్' అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యింది.
దాంతో వెనక్కి తగ్గిన బీసీసీఐ.. వివో తమ ఒప్పందాన్ని ఈ ఏడాదికి రద్దు చేసుకున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు జరగనున్న విషయం తెలిసిందే.