
హైదరాబాద్: బంతి, బంతికి ఉత్కంఠ.. ఓవర్ ఓవర్కు ఫలితంలో తేడాలు.. ఏ బ్యాట్స్మన్ ఎలా ఆడతాడోనని ఊపిరి బిగపట్టి చూసిన క్షణాల్లో.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దుమ్మురేపింది. టీ20 ఫార్మాట్ చరిత్రలోనే తొలిసారి రెండు సూపర్ ఓవర్లు ఆడిన మ్యాచ్లో అద్భుత విజయం సాధించింది. తద్వారా లీగ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్కు చెక్ పెట్టింది. అయితే ఈ మ్యాచ్లో క్రిస్ జోర్డాన్ రనౌట్ అయిన తీరు అందర్ని విస్మయ పరిచింది. అతను క్రీజులో నేరుగా పరుగెత్తకపోవడంతో రనౌట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. అది కూడా డ్రా అయి మరో సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అసలు సంగతేంటంటే.. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఆఖరి బంతిని లాంగాన్ దిశగా ఆడిన జోర్డాన్ క్విక్ డబుల్ తీస్తూ రనౌటయ్యాడు. అయితే సింగిల్ పూర్తిచేసన జోర్డాన్ డబుల్ తీసే క్రమంలో నేరుగా పరుగెత్తకుండా.. క్రీజుకు దూరంగా రన్ తీశాడు. దీంతో దూరం పెరగడంతో ఔటయ్యాడు. నేరుగా పరుగెత్తితే పంజాబ్ సునాయసంగా గెలిచేది. కానీ అతను చేసిన తప్పిదం కారణంగా రెండు సూపర్ ఓవర్లు ఆడిన పరిస్థితి ఏర్పడింది. దాంతో నెటిజన్లు జోర్డాన్పై వంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. సరిగ్గా పరుగెడితే అయిపోయేది కదా.. అని చురకలంటిస్తున్నారు. అతని రనౌట్కు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 రన్స్ చేసింది. క్వింటన్ డికాక్(43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 53)హాఫ్ సెంచరీకి తోడు చివర్లో కీరన్ పొలార్డ్(12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 34 నాటౌట్), కౌల్టర్ నీల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. అనంతరం కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులే చేసింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత తొలి సూపర్ ఓవర్లో పంజాబ్ 5 పరుగులే చేయగా.. ముంబై కూడా అన్నే రన్స్ చేయడంతో మ్యాచ్ మరోసారి టై అయింది. ఇక సెకండ్ సూపర్ ఓవర్లో జోర్డాన్ 11 పరుగులివ్వగా.. గేల్, మయాంక్ నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు.