దుబాయ్: రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న ఐపీఎల లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. శిఖర్ ధావన్(33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 57), శ్రేయస్ అయ్యర్(43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (3/19) మూడు వికెట్లు తీయగా.. జయదేవ్ ఉనద్కత్(2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తీక్ త్యాగి(1/30), శ్రేయస్ గోపాల్ (1/31)తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే ఓపెనర్ పృథ్వీ షా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఢిల్లీ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(2) కూడా ఆర్చర్ మరుసటి ఓవర్లో ఊతప్పకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో 10 పరుగులకే ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ.. చెడ్డ బంతులను బౌండరీలకు తరలించారు. దాంతో ఢిల్లీ పవర్ ప్లే ముగిసే సరికి 2 వికెట్లకు 47 పరుగులు చేసింది.
అనంతరం తమ జోరు కొనసాగించిన ఈ జోడీ ఓవర్కు ఒక బౌండరీ రాబడుతూ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్తపడింది. ఈ క్రమంలో ధావన్ 30 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి లీగ్లో ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ. ఆ వెంటనే ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ధావన్ శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మార్కస్ స్టోయినిస్తో అయ్యర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ నేపథ్యంలో 40 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్స్లతో శ్రేయస్ హాఫ్ సెంచరీ సాధించాడు.
అయితే అదే జోరులో కార్తీక్ త్యాగి బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో ఢిల్లీ స్కోర్ బోర్డు వేగం తగ్గింది. చివరి నాలుగు ఓవర్లో ఆ జట్టు 29 పరుగులే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఇక ఉనాద్కత్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. దాంతో ఢిల్లీ సాధారణ స్కోర్కే పరిమితమైంది.