దుబాయ్: రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇక రిషభ్ పంత్ గాయం కారణంగా దూరమవడం తమ జట్టు సమతూకం దెబ్బతిందన్నాడు. ఓ మార్పుతో బరిలోకి దిగుతున్నామని, హర్షల్ పటేల్ స్థానంలో తుషార్ దేశ్ పాండే జట్టులో వచ్చాడని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఇక టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ తీసుకోవాలనుకున్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఇక ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.
గత వారం ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన పోరులో ఢిల్లీ 46 రన్స్ తేడాతో రాయల్స్ను చిత్తు చేసింది. ఇప్పటిదాకా లీగ్లో మూడు విజయాలు సాధించిన రాజస్తాన్కు ఈ మ్యాచ్లో విజయం అత్యవసరం. మరోవైపు వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీకి ముంబై బ్రేక్ వేసింది. దాంతో ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్కు సేఫ్గా వెళ్లాలనే పట్టుదలతో ఢిల్లీ ఉంది.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 21 మ్యాచ్లు జరగ్గా రాజస్తాన్ 11-10తో లీడ్లో ఉంది. అయితే ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో మాత్రం ఢిల్లీ చేతిలో రాయల్స్ ఓడింది. గత సీజన్లో కూడా ఢిల్లీనే రెండు మ్యాచ్ల్లో గెలుపొందింది. చివరి నాలుగు మ్యాచ్ల్లో ఢిల్లీ 3 గెలవగా.. రాజస్థాన్ ఒకటి గెలుపొందింది.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: షా, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, అశ్విన్, రబడా, అన్రిచ్ నోర్జ్, తుషార్ దేశ్పాండే
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, కార్తీక్ త్యాగీ, జయదేవ్ ఉనాద్కత్