ధోనీ 6, 0, 4, 6, 6
చెన్నై జట్టుపై నిషేధం పడిన సందర్భంగా ఐపీఎల్ 2016 సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కి ఎంఎస్ ధోనీ ఆడాడు. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున అక్షర్ పటేల్ ఆడాడు. లీగ్ దశ ఆఖరి మ్యాచ్లో పుణె విజయానికి చివరి ఓవర్లో 23 పరుగులు అవసరమయ్యాయి. అప్పటి పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్.. అక్షర్ పటేల్ చేతికి బంతినిచ్చాడు. ఆ ఓవర్లో తొలి బంతిని డాట్ చేసిన అక్షర్.. రెండో బంతిని వైడ్గా విసిరాడు. ఆ తర్వాత వరుసగా ఐదు బంతుల్ని ధోనీ 6, 0, 4, 6, 6గా బాది పుణెని గెలిపించాడు. సీన్ కట్ చేస్తే. నాలుగేళ్లు తర్వాత ఢిల్లీకి అక్షర్.. చెన్నైకి ధోనీ ఆడుతున్నారు.
|
అక్షర్ 6, 6, 2, 6
ఢిల్లీ లక్ష్య ఛేదనలో అలెక్స్ క్యారీ ఔట్ అయిన తరువాత క్రీజ్లోకి దిగాడు అక్షర్ పటేల్. పించ్ హిట్టర్గా పేరున్నప్పటికీ.. అడపా దడపా మాత్రమే షాట్లు ఆడతాడనే అపవాదూ అతనిపై ఉంది. ఎప్పుడు ఎలా ఆడుతాడో ఎవరికీ తెలియదు. దీంతో మరో ఎండ్లో ఉన్న శిఖర్ ధావన్పైనే ఢిల్లీ ఆశలు పెట్టుకుంది. అయితే వారి అంచనాలు తలకిందలను చేస్తూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు అక్షర్. ఢిల్లీ విజయానికి 17 పరుగులు అవసరంకాగా.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పిన్నర్ రవీంద్ర జడేజాకి బంతినిచ్చాడు. తొలి బంతిని జడేజా వైడ్ రూపంలో విసిరేశాడు. ఆ తర్వాత బంతికి ధావన్ సింగిల్ తీయగా.. రెండో బంతి నుంచి అక్షర్ పటేల్ వరుసగా 6, 6, 2, 6 బాదేశాడు. ఢిల్లీ విజయాన్ని అందుకుంది.
ధోనీతో అక్షర్ని పోల్చడమేంటి
2016 నాటి మ్యాచ్ని ప్రస్తావిస్తూ ఎంఎస్ ధోనీకి అక్షర్ పటేల్ భలే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడంటూ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా గుర్తు చేశాడు. ఈ మేరకు అతను ఓ ట్వీట్ చేశాడు. 'ధావన్ అద్భుతమైన సెంచరీ బాదాడు. నాలుగేళ్ల కిందట ధోనీ విజృంభణకు అక్షర్ పటేల్ బలి అయ్యాడు. ఇప్పుడు ధోనీ బృందం వంతు వచ్చింది. మహీపై అక్షర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. చెన్నై బాగా బ్యాటింగ్ చేసింది' అని ట్వీటాడు. అయితే సెహ్వాగ్కు ఎంఎస్ ధోనీ ఫ్యాన్ పంచ్ ఇచ్చాడు. 'ధోనీతో అక్షర్ని పోల్చడమేంటి?. ధోనీ 6 బంతుల్లో 23 రన్స్ చేశాడు. అక్షర్ 6 బంతుల్లో 17 పరుగులు చేశాడు' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.
బ్రావో ఫిట్గా లేకపోవడంతో
ఆఖరి ఓవర్ డ్వేన్ బ్రావో బౌలింగ్ చేస్తాడని అందరూ భావించగా.. ఎంఎస్ ధోనీ మాత్రం అనూహ్యంగా రవీంద్ర జడేజా చేతికి బంతికి అందించాడు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉండగా.. ఎడమ చేతి వాటం స్పిన్నర్తో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే మ్యాచ్ ముగియగానే ధోనీ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. 'ఫిట్గా లేకపోవడంతో బ్రావో మైదానాన్ని వీడాడు. అతడు తిరిగొచ్చి బౌలింగ్ చేస్తాడని భావించలేదు. దీంతో మా ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కర్ణ్ శర్మ, రెండోది జడేజా. ఈ ఇద్దరిలో నేను జడేజావైపు మొగ్గు చూపాను' అని ధోనీ తెలిపాడు.
SRH vs KKR: వార్నర్ను ఊరిస్తున్న రెండు అరుదైన రికార్డులు.. మరో 10 రన్స్ చేస్తే!!