
షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని కెప్టెన్ ధోనీ చెప్పాడు. ఇక జట్టులో ఒక మార్పుచోటు చేసుకుందని, పియూష్ చావ్లా స్థానంలో కేదార్ జాదవ్ వచ్చాడని తెలిపాడు. ఇక ఢిల్లీ ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగింది.
ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారం చూస్తే టేబుల్లో చెన్నై ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. దాంతో చెన్నైకి ఈ మ్యాచ్ల్లో గెలవడం అత్యవసరం. మరీ టేబుల్ టాపర్గా ఉన్న ఢిల్లీని ఈ మ్యాచ్లో చెన్నై ఎంతమేరకు అడ్డుకుంటుందో చూడాలి. ఈ సీజన్ ఫస్టాఫ్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో ఢిల్లీనే 44 పరుగులతో గెలుపొందింది. దాంతో ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకోవడంతో పాటు తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీసుకోవాలని ధోనీ సేన భావిస్తోంది. మరోవైపు ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంటున్న ఢిల్లీ అదే జోరును కొనసాగించాలనుకుంటుంది.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 22 సార్లు తలపడగా 15-7తో చెన్నై లీడ్లో ఉంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం ఢిల్లీనే పైచేయి సాధించింది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని ధోనీసేన భావిస్తోంది. గత సీజన్లో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా మూడింటి మూడు చెన్నైనే గెలిచింది. చివరి ఆరు మ్యాచ్ల్లో మాత్రం చెన్నై 4 సార్లు గెలవగా.. ఢిల్లీ రెండు మ్యాచ్ల్లో పై చేయి సాధించింది.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అశ్విన్, అన్రిచ్ నోర్జ్, తుషార్ దేశ్ పాండే
చెన్నై సూపర్ కింగ్స్: సామ్ కరన్, ఫాఫ్ డూప్లెసిస్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, షార్దుల్ ఠాకుర్, కరన్ శర్మ, కేదార్ జాదవ్