
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్తో గురువారం జరిగిన చావో రేవో మ్యాచ్లో ఓడినా కోల్కతా నైట్రైడర్స్కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయని ఆ జట్టు మెంటార్ డేవిడ్ హస్సీ తెలిపాడు. మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్కు చేరి అందరికి ఆశ్చర్యపరుస్తామని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఈ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ధీమా వ్యక్తం చేశాడు.
'పలు మ్యాచ్ల్లో ఓడి మాకు మేమే ఇలాంటి క్లిష్ట పరిస్థితిని తెచ్చుకున్నాం. అయితే మా పోరాటం అప్పుడే ముగియలేదు. మేమింకా పోటీలోనే ఉన్నాం. రాజస్థాన్ రాయల్స్తో మా తదుపరి మ్యాచ్. ఈ మ్యాచ్కు కొద్ది రోజుల సమయం ఉంది. మరింత మెరుగై ఆ మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం. ఈ పోటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.
ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చి ప్లేఆఫ్స్లో ఇతరుల్ని ఆశ్చర్యపరుస్తాం. ప్రతీ ఓటమి కష్టమే. ఈ మ్యాచ్లో చెన్నై అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ విజయానికి ఆ జట్టు అర్హమైనది. రాయుడు, రుతురాజ్ రెండో వికెట్కు బాగా ఆడటంతో చెన్నై విజయం సాధించింది. మా బ్యాట్స్మన్ నితీశ్ రాణా కూడా ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్నాడు. అతనికి ఇది మంచి సీజన్'అని డేవిడ్ హస్సీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీశ్ రాణా (61 బంతుల్లో 87; 10 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించాడు. ఇన్గిడి 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రుతురాజ్ గైక్వాడ్ (53 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్లు) చెన్నై గెలిచేందుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడేయగా... జడేజా ఆఖర్లో సిక్సర్లతో జట్టును గెలిపించాడు. రాయుడు (20 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు.
ఈ ఓటమితో కోల్కతా నైట్రైడర్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ఇప్పటికి 13 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆ జట్టు 12 పాయింట్లతో కొనసాగుతోంది. తదుపరి దశకు చేరుకోవాలంటే ఆఖరి మ్యాచ్ గెలవడమే కాకుండా రన్రేట్ను కూడా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, అదంత సులువు కాదు. అది మాత్రమేకాకుండా పంజాబ్, హైదరాబాద్ జట్లు తదుపరి మ్యాచ్ల్లో ఓటమిపాలవ్వాలి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కోల్కతా ప్లేఆఫ్స్కు చేరడం కష్టమే.