
షార్జా: చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా ఈ మ్యాచ్కు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. కీరన్ పోలార్డ్ తాత్కలిక సారథిగా జట్టును నడిపించనున్నాడు. పిచ్ పరిస్థితుల కారణంగానే ఫీల్డింగ్ తీసుకున్నామని పొలార్డ్ చెప్పుకొచ్చాడు. రోహిత్ ఎడమ తొడ కండరాలు పట్టేసాయని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని తెలిపాడు. బీసీసీఐ సంప్రదింపుల తర్వాత అతని గాయాన్ని మరో రోజు పరీక్షించాలని టీమ్మెనేజ్మెంట్ భావించిందన్నాడు. అతని స్థానంలో జట్టులోకి సౌరభ్ తివారీ వచ్చాడన్నాడు.
చెన్నై జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. వాట్సన్, జాదవ్, చావ్లాల స్థానంలో ఇమ్రాన్ తాహిర్, జగదీషన్, రుతురాజ్ జట్టులోకి వచ్చారు. ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవడమే లక్ష్యంగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతుండగా.. వరుస పరాజయాలకు తోడు కీలక ప్లేయర్ల సేవలను కోల్పోయి నిరాశలో ఉన్న సీఎస్కే మాత్రం ముంబైకి మరోసారి షాకివ్వాలని చూస్తోంది. ఇప్పటిదాకా పది మ్యాచ్ లాడి ఆరు పాయింట్లు సాధించిన చెన్నై.. మిగిలిన నాలుగింటిలో గెలిచినా ప్లే ఆఫ్ బెర్త్ దక్కే సూచనల్లేవు. కానీ ఇప్పటికే తమకు ఎన్నో చేదు జ్ఞాపకాలు మిగిల్చిన ఈ సీజన్ ను అదిరిపోయే ఫినిషింగ్ టచ్ తో ముగించాలని భావిస్తోంది. మరోవైపు సీజన్ ప్రారంభమ్యాచ్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు టేబుల్ టాపర్గా నిలవాలని ముంబై పట్టుదలతో ఉంది. మరి ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి.
ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్లు ఆడగా ముంబై 17 సార్లు, చెన్నై 12 సార్లు గెలిచింది. గత ఐదు మ్యాచ్ల్లో మాత్రం నాలుగింటిలో ముంబై గెలవగా.. ఒక్కదానిలోనే ముంబై విజయం సాధించింది. గత సీజన్లో ఇరు జట్ల మధ్య ఫైనల్తో సహా నాలుగు మ్యాచ్లు జరగ్గా నాలుగింటిలో ముంబైనే గెలవడం విశేషం.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: ఫాఫ్ డూప్లెసిస్, ఎన్ జగదీషన్, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, దీపక్ చాహర్, షార్ధుల్ ఠాకుర్, ఇమ్రాన్ తాహిర్, హజల్వుడ్
ముంబై ఇండియన్స్: క్వింటన్ డికాక్(కీపర్), ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నీల్ రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా