
షార్జా: వరుస పరాజయాలతో చతికిలపడ్డ చెన్నై సూపర్ కింగ్స్ కథ ఏ మాత్రం మారలేదు. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు టాపార్డర్ అదే తడబాటును కొనసాగిస్తూ విఫలమైంది. 3 ఓవర్లలో 3 పరుగులు చేసి 4 వికెట్లు చేజార్చుకుంది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(0) ఏల్బీగా ఔటవ్వడంతో పరుగుల ఖాతా తెరవకుండానే చెన్నై వికెట్ల పతనం మొదలైంది.
ఇక జస్ప్రీత్ బుమ్రా వేసిన రెండో ఓవర్లో వరుస బంతుల్లో అంబటి రాయుడు(2), ఎన్ జగదీషన్(0) పెవిలియన్ చేరారు. రాయుడు కీపర్ క్యాచ్గా వెనుదిరిగగా.. జగదీషన్ స్లిప్లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ క్యాచ్కు పెవిలియన్ చేరాడు. బౌల్ట్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే ఫాఫ్ డూప్లెసిస్(1) కూడా కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో చెన్నై 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన ధోనీ, జడేజా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో ధోనీ(16 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్తో 16) రెండు ఫోర్లు కొట్టగా.. జడేజా(7) కూడా ఓ ఫోర్ కొట్టాడు. దాంతో ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి ఓవర్ను కృనాల్ కట్టుదిట్టంగా వేయగా.. బౌల్ట్ వేసిన 6వ ఓవర్లో జడేజా క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం రాహుల్ వేసిన ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన ధోనీ ఆ మరుసటి బంతికే మరో షాట్కు ప్రయత్నించి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
ఏడు ఓవర్లలోనే సీఎస్కే ఆరు వికెట్లు కోల్పోగా, పవర్ ప్లే ముగిసే సరికి ఐదు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా చెత్త రికార్డును సీఎస్కే మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే పవర్ ప్లేలో ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. దాంతో చెన్నై మరో అప్రతిష్టను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడం కూడా ఇదే తొలిసారి.