
రాంచీ: కేంద్ర ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక అనుమతి రావడంతో ఐపీఎల్ 2020 సీజన్ పై అటు బీసీసీఐ, ఇటు ఫ్రాంచైజీలు వేగం పెంచాయి. ఇప్పటికే సిద్ధం చేసుకున్న తమ ప్లాన్లను అమల్లో పెడుతున్నాయి. ఇందులో భాగంగా ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అతని పాటు సహచర ఆటగాడు మోనూ కుమార్కు కూడా కోవిడ్-19 పరీక్షలు జరిపారు.
ఈ విషయాన్ని పరీక్షల కోసం సాంపుల్స్ సేకరించిన గురునానక్ హాస్పిటల్కు చెందిన మైక్రోప్రాక్సిస్ లాబ్ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ తెలిపారు. తమ సిబ్బంది ధోనీ ఫామ్ హౌస్కు వెళ్లి మరి కోవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ టెస్ట్కు సంబంధించిన సాంపుల్స్ కలెక్ట్ చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. 'బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మా లాబ్ స్టాఫ్ ధోనీ ఫామ్హౌస్కు వెళ్లి ఇద్దరి క్రికెటర్ల సాంపుల్స్ తీసుకున్నారు. వాటిని టెస్టింగ్కు పంపించాం. ఫలితాలు గురువారం రానున్నాయి'అని సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు.
ఈ టెస్ట్ల్లో నెగటీవ్ వస్తే ధోనీ, మోనూకుమార్ ఇద్దరూ ఆగస్టు 14నే చెన్నైకు రానున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొంటారు. 21న చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్కు వెళ్తున్నట్లు ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక జట్లను యూఏఈ తరలించే ముందు బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం ఆటగాళ్లు, ఫ్రాంచైజీ సిబ్బందితో పాటు టీవీ క్రూకు కూడా రెండు సార్లు కరోనా టెస్ట్లు చేయాలి. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ఆ ప్రక్రియ చెపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్కు కరోనా పాజిటీవ్ అని తెలింది. ప్రస్తుతం అతను క్వారంటైన్లో ఉండగా.. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ప్రొటోకాల్స్ ప్రకారం జట్టుతో కలుస్తాడని రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
నిబంధనల ప్రకారం దుబాయ్కు వెళ్లేముందు రెండు సార్లు.. వెళ్లిన తర్వాత మొదటి రోజు, మూడో రోజు, ఆరో రోజు మరోసారి టెస్ట్లు చేయనున్నారు. ఈ మూడు టెస్ట్ల్లో నెగటీవ్ వస్తే బయోబబుల్ వాతావరణంలో మ్యాచ్లు ఆడేందుకు అనుమతిస్తారు. ఇక టోర్నీ జరుగుతున్నంత కాలం ఐదురోజులకోసారి బయోబబుల్లో ఉన్నందరికి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ బయోబబుల్లో ఆటగాళ్లంతా మాస్క్లు పెట్టుకోవడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరి పాటించాలి.