
దుబాయ్: అస్వస్థతకు గురైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్టార్ ప్లేయర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కోలుకున్నాడు. ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడ్డ ఈ విండీస్ వీరుడు పూర్తిగా ఫిట్ అయ్యాడని కింగ్స్ పంజాబ్ ప్రకటించింది. 'కింగ్స్ పంజాబ్ అభిమానులకు మంచి వార్త. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అస్వస్థత నుంచి కోలుకున్నాడు. ట్రైనింగ్ కూడా మొదలు పెట్టాడు.'అని ఆ ప్రకటనలో పేర్కొంది.
దాంతో తదుపరి మ్యాచ్ల్లో గేల్ ఆడటం దాదాపు ఖాయమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగే మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. వాస్తవానికి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనే అతను ఆడాల్సింది. కానీ అనూహ్యంగా ఫుడ్ పాయిజన్ భారిన పడటంతో వరుసగా రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ రెండు మ్యాచ్ల్లో పంజాబ్ ఓడింది.
ఆల్రౌండరనే కారణంతో గ్లేన్ మ్యాక్స్వెల్ను ఆడించిన పంజాబ్ భారీ మూల్యమే చెల్లించుకుంది. దాంతో యూనివర్సల్ బాస్ను తీసుకురావాలని భావిస్తోంది. ఇక క్రిస్ గేల్ కూడా తన ఆరోగ్య స్థితి పరిస్థితిని వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను విడుదల చేశాడు. చేతిలో గ్లాస్, కళ్లపై కీరదోశ, నోట్లో క్యారెట్ ముక్క పెట్టుకుని ఆసుపత్రి బెడ్పై సేదదీరుతూ ఫోన్లో మాట్లాడుతున్నట్టున్న ఫొటోలో ఉంది. ఆ ఫొటోకు గేల్ మంచి క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు.
'ఓ విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. నేనెప్పుడూ పోరాడకుండా వెనుదిరగను. ఎందుకంటే.. నేను యూనివర్సల్ బాస్ను. అది ఎప్పటికీ మారదు!!. నా నుంచి అన్నిసార్లూ కాకున్నా కొన్నిసార్లు నేర్చుకోచ్చు. నా శైలిని, పోరాట పటిమను మరచిపోకండి. నేను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని గేల్ తెలిపాడు. మరి కింగ్స్ పంజాబ్ రాతను గేల్ మారుస్తాడో లేదో చూడాలి. ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్ ఏడు మ్యాచ్ల్లో ఒకటే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.