న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి చైనా మొబైల్ కంపెనీ వివో తప్పుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. గురువారం ఓ ఏక వ్యాఖ్య మెయిల్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
’ఐపీఎల్-2020తో భాగస్వామ్యం రద్దు చేసుకొనేదుకు బీసీసీఐ, వివో మొబైల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ నిర్ణయించాయి' అని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఒప్పందాన్ని ఈ ఏడాదికేనా.. లేక మొత్తమా అనే విషయంలో కూడా బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు. ఇక 2017లో టైటిల్ స్పానర్షిప్ హక్కులను దక్కించుకున్న వివో.. ఐదేళ్లకు రూ.2190 కోట్లకు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది రూ.440 కోట్లు చెల్లిస్తూ వస్తుంది.
ఇక వివో తప్పుకోవడంతో బీసీసీఐ మరో స్పాన్సర్ వెతుక్కునే పనిలో పడింది. కరోనాతో నెలకొన్న పరిస్థితుల కారణంగా వివో చెల్లించే ఆదాయం రావడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో బోర్డు కొంత తగ్గించి రూ.300 కోట్లకు కొత్త స్పాన్సర్తో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉందని తెలుస్తోంది. టెలికామ్ దిగ్గజం జియో ఈ ఏడాదితో పాటు వచ్చే రెండేళ్లకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
సెప్టెంబర్-19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించేందుకు బీసీసీఐ సంసిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి గత ఆదివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వివోను టైటిల్ స్పాన్సర్గా కొనసాగించాలని నిర్ణయించారు. కానీ ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వివో వెనకడుగు వేసింది. దీంతో బీసీసీఐ కూడా చైనా మొబైల్ కంపెనీతో తెగదెంపులు చేసుకోలేక తప్పలేదు.