న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్కు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కరోనా బారిన పడటం.. ఆ జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా తప్పుకోవడంతో లీగ్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. తాజాగా ఈ లీగ్ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ టీవీ క్రూలో ఒకరికి కరోనా సోకింది. దీంతో స్టార్ స్పోర్ట్స్ తమ సిబ్బంది ప్రయాణాన్ని వాయిదా వేసింది.
వాస్తవానికి వివిధ విభాగాల్లో పనిచేసే స్టార్ ప్రొడక్షన్ టీమ్ తొలి బ్యాచ్ సోమవారం బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్కతా, ముంబై నుంచి బయలుదేరాల్సింది. కానీ బీసీసీఐ నిబంధనల మేరకు వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటీవ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన స్టార్ గ్రూప్.. వెంటనే తమ సిబ్బంది ప్రయాణాన్ని వాయిదా వేసింది. స్టార్ టీవీ క్రూ ప్రయాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో యూఏఈలో వారి క్వారంటైన్ పిరీయడ్ కూడా పెరగనుంది. ఇది లీగ్ ప్రారంభంపై ప్రభావం చూపనుంది.
అయితే లీగ్ ప్రారంభానికి ఇంకా 18 రోజుల సమయం ఉండగా.. బీసీసీఐ మాత్రం ఇప్పటి వరకు షెడ్యూల్ను విడుదల చేయలేదు. టీవీ క్రూకు సంబంధించిన మరో బ్యాచ్ కరోనా పరీక్షా ఫలితాల కోసం స్టార్ ఎదురుచూస్తుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఐపీఎల్ జరిగే దుబాయ్, షార్జా, అబుదాబి వేదికల్లో కరోనా ప్రొటోకాల్స్ వేర్వేరుగా ఉండటం లీగ్ నిర్వాహకులకు సవాల్గా మారింది. ఇప్పటికే జట్లన్నీ అక్కడికి చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి.
ఈ సీజన్ తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఆనవాయితీ ప్రకారమైతే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్.. రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ నిర్వహించాల్సింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కరోనా బారిన పడటంతో ఆ జట్టు లీగ్ ప్రారంభమయ్యే సెప్టెంబర్ 19 వరకు సంసిద్దమయ్యే అవకాశాలు లేవు. దీంతో షెడ్యూల్లొ స్వల్ప మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్ ఆర్సీబీ, ముంబై మధ్య నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2020 మొత్తానికే జరగకపోతే ఏం చేస్తారు..? ఫ్రాంచైజీలపై బీసీసీఐ ఫైర్!