
హైదరాబాద్: వెస్టిండిస్ ఆటగాళ్లకు టెస్టు ఫార్మాట్లో ఆడటం ఇష్టం ఉండదని, అందుకే వాళ్లు టీ20ల్లో విజయవంతం అవుతున్నారని జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 11వ సీజన్లో హీత్ స్ట్రీక్ కోల్కతా బౌలింగ్ కోచ్గా వ్యవహారిస్తున్నారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ 63 బంతుల్లో 104 పరుగులతో నాటౌట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీత్ స్ట్రీక్ మాట్లాడుతూ 'ధాటిగా ఆడటాన్ని వెస్టిండీస్ ఆటగాళ్లు బాగా ఆస్వాదిస్తారు. సుదీర్ఘంగా ఆడడం వాళ్లకు చాలా విసుగొస్తున్నట్లు ఉంది' అని అన్నాడు.
'అందుకే ఆ జట్టులో ఎక్కువమంది ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్స్లో ఆడుతున్నారు. గేల్ మాత్రమే కాదు రసెల్, సునీల్ నరైన్, పొలార్డ్, డ్వేన్ బ్రావో ఇలా ప్రతి ఒక్కరూ టీ20 ఫార్మాట్నే ఎంచుకుంటున్నారు. ఐపీఎల్తో పాటు బిగ్బాష్, పాకిస్థాన్ సూపర్ లీగ్, కరీబియన్ ప్రిమియర్ లీగ్ లాంటి లీగ్స్లో ఆడుతున్నారు' అని తెలిపాడు.
'పొలార్డ్, రసెల్ లాంటి వాళ్లు చాలా శక్తివంతులు. వాళ్లు షాట్ సరిగా ఆడకపోయినా కూడా బంతి వెళ్లి స్టాండ్స్లో పడుతుంది. క్రిస్ గేల్ లాంటి వాళ్లు ఆడుతున్నప్పుడు ఏ బౌలింగ్ కోచ్ కూడా ఫలానా వ్యూహంతో బరిలో దిగాలని చెప్పలేడు. బ్యాట్స్మెన్ రివర్స్ ర్యాంప్ లాంటి కొత్త షాట్లు ఆడుతున్నారు. బౌలర్లకు ఇదో పెద్ద సవాల్' అని హీత్ స్ట్రీక్ అన్నాడు.