
హైదరాబాద్: ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ను కొనడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాకపోవడంతో చివర్లో రూ.2 కోట్ల కనీస ధరకే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం అతడిని దక్కించుకున్న సంగతి తెలిసిందే. నిజానికి ఎవరైనా క్రిస్ గేల్ కోసం పోటీకి దిగి ఉంటే పంజాబ్ వెనక్కి తగ్గి ఉండేదట.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
అయితే, తమ అదృష్టం కొద్దీ అలాంటిదేమీ జరగలేదని పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా చెప్పుకొచ్చాడు. 'మా దగ్గర అప్పుడు కేవలం రూ.2.1 కోట్లు మాత్రమే ఉన్నాయి. మేం క్రిస్గేల్ బిడ్ వచ్చినప్పుడు వేలం పాటలో పాల్గొని ఉంటే వేరే ప్రాంఛైజీలు అతడి ధరను మరింత పెంచేవి. అప్పుడతన్ని కొనుగోలు చేయడానికి అన్ని డబ్బులు ఉండేవి కావు' అని చెప్పాడు.
'అదృష్టవశాత్తూ మేం బిడ్ వేసినప్పుడు మరో జట్టు అతడిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. దాంతో అతడిని దక్కించుకున్నందుకు సంతోషపడ్డాం' అని నెస్వాడియా పేర్కొన్నాడు. ఇక, ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తోన్న యువరాజ్ సింగ్ కూడా నెస్ వాడియా స్పందించాడు.

'ప్రస్తుతం యువీ పరుగులు చేయకపోవచ్చు. అతడు తిరిగి ఫామ్లోకి వస్తాడన్న నమ్మకం మాకుంది. యువీ జట్టులో ఉండటం మా విలువను పెంచుతుంది. అందుకే మేమతన్ని తిరిగి తెచ్చుకున్నాం' అని తెలిపాడు. ఇక, కింగ్స్ ఎలెవన్ కెప్టెన్గా అశ్విన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని కొనియాడాడు.
కింగ్స్ ఎలెవన్ జట్టులో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అంకిత్ రాజ్పుత్, ముజీబ్ జర్దాన్లు అద్భుత ప్రదర్శన చేస్తోండటంతో సంతోషంగా ఉందని నెస్ వాడియా వెల్లడించాడు.